కరీంనగర్ : కాంగ్రెస్కు అధికారం ఇస్తే సంక్షోభం తప్పదని, మళ్లీ కరువు, కాటకాలు, కోతలు తప్పవని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. బీఆర్ఎస్ పాలన అంటే ప్రజల సంక్షేమం కోరే పార్టీ అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 56, 59, 60 డివిజన్లల్లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ధరణి(Dharani) తీసేస్తామని, మూడు గంటల కరెంట్ ఇస్తామని అంటున్న కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ‘ తెలంగాణ రాకముందు కరీంనగర్లో రోడ్లు ఎలా ఉండేవి. ఇప్పుడు ఎలా ఉన్నాయో గమనించాలి. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని’ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పాలనలో వేల కోట్ల నిధులు తీసుకువచ్చి నగరంలోని అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా అభివృద్ధి పనులను చేపట్టామన్నారు.
గత పదేళ్లలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మతాల ప్రజలు కలిసి జీవించే విధంగా కరీంనగర్ను కాపాడామని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమాలు కొనసాగాలంటే కేసీఆర్(CM KCR) ను గెలిపించు కోవాలని సూచించారు. బీజేపీ రాష్ట్రంలో ఎక్కడా గెలిచేది లేదన్నారు. అలాంటి పార్టీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దని సూచించారు. అసమర్థ ఎంపీ బండి సంజయ్ ఉండడం వల్ల కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఫ్రీ కరెంట్, మిషన్ కాకతీయ, రైతుబీమా తదితర పథకాలు అమలు చేశారని చెప్పారు. మరెన్నో కొత్త పథకాలు కొత్త ప్రభుత్వంలో అమలుకానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.