రాజన్న సిరిసిల్ల జిల్లాను పోషకాహారలోప రహితంగా తీర్చిదిద్దాలన్న మంత్రి కేటీఆర్ మార్గదర్శనం మేరకు కలెక్టర్ అనురాగ్ జయంతి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ‘మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్’ పేరిట రేపటి నుంచే నయా కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు. కాల్షియం, ఐరన్, పీచు పదార్థం ఎక్కువ ఉండే రాగి లడ్డూను ప్రతి శనివారం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులకు అందించనున్నారు. ఈ ప్రయోగం వెనుక.. పోషకాహారలోప నివారణే కాక, స్థానిక రైతులను చిరుధాన్యాల సాగువైపు మళ్లించే లక్ష్యం కూడా ఉన్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది. అందులో భాగంగా పోషకాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీల వేదికగా అనేక రకాల కార్యక్రమాలను అమలు చేస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 587 అంగన్వాడీ కేంద్రాల్లో 36 వేల మంది పిల్లలు నమోదయ్యారు. కొన్ని చోట్ల పిల్లలతోపాటుగా గర్భిణుల్లో పోషకాహార లోపం ఉన్నట్లుగా గుర్తించారు. దీనిని పూర్తిస్థాయిలో నివారించి, ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలన్న లక్ష్యంతో మంత్రి కేటీఆర్ మార్గదర్శనం మేరకు కలెక్టర్ అనురాగ్ జయంతి ‘మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
చిరుధాన్యాలైన రాగులతో చేసే లడ్డూల్లో కాల్షియం, పీచు పదార్థం, ఐరన్ ఎక్కువ ఉండనుండగా, మొదటి విడుత ఈ రాగి లడ్డూను ప్రతి శనివారం అంగన్వాడీ కేంద్రాల్లో అందించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఒక్కో అంగన్వాడీ పరిధిలో నెలకు సుమారు వెయ్యి రూపాయల చొప్పున ఖర్చవవుతుందని అంచనా వేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి.. రాష్ర్టానికి ఒక పైలట్ ప్రాజెక్టుగా అందించాలన్న మంత్రి కేటీఆర్ సూచనల మేరకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. అందుకయ్యే ఖర్చు కోసం ముందుగా గ్రామ పంచాయతీలను భాగస్వాములను చేశారు. మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని సర్పంచులు, సంబంధిత అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులకు వివరించడంతో వారంతా ముందుకొచ్చారు. కొంత మంది ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు రాగా.. అన్ని చోట్లా గ్రామ పంచాయతీల నిధుల నుంచి వినియోగించడానికి ముందుకొచ్చారు. ఏదైనా జీపీలో నిధులు లేకపోతే.. జిల్లా సంక్షేమ శాఖ నుంచి వెచ్చించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు, లడ్డూలను తయారు చేసే బాధ్యతను అంగన్వాడీ టీచర్లకు అప్పగించారు. రొటీన్కు భిన్నంగా ఇచ్చే ఈ రాగి లడ్డూను కొన్ని వారాల పాటు అంగన్వాడీల్లో అమలు చేసి.. ఆ తర్వాత అధ్యయనం చేయాలని నిర్ణయించారు.
వచ్చే ఫలితాలను బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని శనివారం నుంచి అమల్లోకి తేనున్నారు. దీనిద్వారా ఒకవైపు పిల్లలు, గర్భిణిలకు మంచి పోషకాహారం అందించడమేకాకుండా.. మరోవైపు చిరుధాన్యాల ఆవశ్యకతను రైతులకు తెలియజేయాలన్న లక్ష్యం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. చిరుధాన్యాలు, వాటి ద్వారా చేకూరే ప్రయోజనాలతోపాటు సాగుకు అనువైన భూములు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతులకు వచ్చే లాభాలు వంటి అంశాలను రైతులకు కరపత్రాల ద్వారా వివరిస్తున్నారు. నిజానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేల స్వభావం చాలా ప్రాంతాల్లో చిరుధాన్యాలు పండించడానికి అనువుగా ఉంటుంది. మొత్తానికి పోషకాహార రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఆరోగ్యానికి ఎంతో మేలు
రాగుల్లో కాల్షియం, ఇనుము, ప్రొటీన్, ఫైబర్ లాంటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రోజూ ఏదో ఓ రూపంలో తీసుకుంటే ఎముకలు గట్టిపడుతాయి. పిల్లలతోపాటు గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారిస్తుంది. బాలింతల్లో పాల ఉత్పత్తి పెంపు కోసం రాగులు దోహదపడతాయి. అంతేకాకుండా రాగులకు చలువ చేసే గుణం ఉంది.
ప్రతి శనివారం చిరు ధాన్యాలతో ఆహారం
చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు చిరు ధాన్యాలతో అదనపు ఆహారం అందిస్తాం. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాం. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో రేపటి నుంచే అమలు చేస్తాం. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు ప్రతి శనివారం అంగన్వాడీ కేంద్రాల్లో రాగి జావ, రాగి లడ్డు, రాగి పాయసం ఇస్తాం. ముఖ్యంగా రాగులు వంటి చిరు ధాన్యాల్లో అధిక మొత్తంలో ఇనుము, కాల్షియం, ప్రొటీన్, ఫైబర్ లాంటి పదార్థాలు ఉండడంతో పెరుగుదల అధికంగా ఉంటుంది.
– అనురాగ్ జయంతి, రాజన్న సిరిసిల్ల కలెక్టర్