నేడు.. సిరిసిల్ల సిరుల జిల్లా. నీటి గోస తీరింది. పచ్చని పంటలతో సస్యశ్యామలమైంది. వస్త్ర పరిశ్రమ పునర్జీవం పోసుకున్నది. అప్పటి కరువు గడ్డ.. ఉపాధికి అడ్డాగా మారింది. ప్రతి ఒక్కరికీ చేతినిండా పనిదొరుకుతున్నది. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలనుంచి కార్మికలోకం ఇక్కడికి వలసవస్తున్నది. చేతినిండా పని, సరిపడా కూలి వస్తుండడంతో సంతోషంలో మునిగితేలుతున్నది.
– రాజన్న సిరిసిల్ల, మే 6 (నమస్తే తెలంగాణ)
నాడు.. సిరిసిల్ల మెట్టప్రాంతం. తాగునీటికే కాదు, సాగునీటికీ తండ్లాడింది. వ్యవసాయ రంగం కుదేలైంది. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. పనిదొరక్క సిరిసిల్ల నేతన్నలు ముంబై, భీవండి, షోలాపూర్ లాంటిచోట్లకు వలసపోయేది. సాగునీరులేక పంట భూములను పడావుపెట్టి బతుకు వేటకు బయల్దేరేది. భార్యాబిడ్డలను వదిలి అక్కడి కార్ఖానాల్లో కాయకష్టం చేసేది.
తెలంగాణమే జాదా బనీహై
హమారా గావ్ రతన్పూర్. నాకు భార్య, ఇద్దరు పిల్లలు. అక్కడ వారంల మూడు రోజులే పని ఉంటుంది. భార్యాభర్తలం పొద్దంతా కష్టపడితే రోజుకు కూలి (బనీ) మూడు, నాలుగు వందలే. పొట్టకు కూడా సరిపోయేదికాదు. తెలంగాణలో ప్రతిరోజూ పనిదొరుకుతుందని నాలుగేళ్ల కింద కాంట్రాక్టర్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిండు. ఇక్కడి ఓ రైస్ మిల్లులో పనిజేత్తున్నం. వడ్లచ్చినపుడు కొనుగోలు సెంటర్లలో సంచుల్లో నింపి లారీల్లో ఎక్కిస్తం. నెలకు 15 వేల నుంచి 18 వేలు కూలీ వస్తున్నది. 6వేలు పొట్టకు పోను మిగిలిన పైసలు ఇంటికి పంపుతున్న. మా రాష్ట్రంలో కన్నా ఇక్కడే పనిమంచిగున్నది. కూలి ఎక్కువ వస్తున్నది.
– మిథిలేశ్కుమార్, బిహార్
రాజన్న సిరిసిల్ల, మే 6 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలకులు అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో సిరిసిల్ల ప్రాంతం వెనుకడిపోయింది. సాగునీరు దెవుడెరుగు, గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీటి కోసం విలవిలలాడింది. నేతన్నల అకలిచావులు, ఆత్మహత్యలు, వారి కుటుంబసభ్యుల ఆర్తనాదాలతో బిక్కచచ్చి పోయింది. ఇక్కడి ప్రజానీకం ఉపాధి కోసం ఎడారి దేశాలకు వలసెల్లిపోయింది. కానీ తెలంగాణ సిద్ధించిన తర్వాత స్వపరిపాలనలో రూపురేఖలు మార్చుకున్నది. సీఎం కేసీఆర్ చేపట్టిన కర్షక, కార్మిక అనుకూల విధానలు, అమాత్యుడు కేటీఆర్ చొరవతో అభివృద్ధి పథంలో సాగుతున్నది. ఇక్కడి వారికి చేతినిండా పనికల్పిస్తూనే బిహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటున్నది. వారికి ప్రతిరోజూ పనికల్పిస్తూ కడుపునిండా తిండిపెడుతున్నది.
పండుగలా ఉపాధి
ప్రభుత్వం రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఎస్సారార్, అనంతసాగర్ రిజర్వాయర్లను నిర్మించింది. రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు కేవలం 90 ఎకరాలు సాగులో ఉండడగా, నేడు రెండు లక్షల ఎకరాల్లో బంగారు పంటలు పండుతున్నాయి. దీనికితోడు సర్కారు వస్త్ర పరిశ్రమలకు పునర్జీవం పోసింది. మరమగ్గాలను ఆధునీకరించింది. భవన నిర్మాణ రంగం విస్తరించింది. క్రషర్లు, అప్పారెల్ పార్క్ లాంటి పరిశ్రమలకు నిలయంగా మారింది. ధాన్యం దండిగా పండడంతో ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. కూలీలకు కొరత ఏర్పడ్డది. ఈ పరిస్థితుల్లో బిహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రకు చెందిన కూలీలు సుమారు రెండు వేల మంది ఇక్కడికి వలస వచ్చారు. ప్రతిరోజూ పనిదొరుకుతుండడంతో నెలకు 15నుంచి 18వేల వరకు సంపాదిస్తున్నారు. మారాష్ట్రం కంటే తెలంగాణలోనే ఉపాధి బాగుందని, శ్రమకు తగ్గ వేతనం ఇస్తున్నట్లు సంతోషంగా చెబుతున్నారు. పేదలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొంటున్నారు. తాము సైతం ఇక్కడే స్థిరపడాలనుకుంటున్నామని చెబుతున్నారు.
మా దగ్గర ఇంత కూలీ రాదు
మాది మధ్యప్రదేశ్, రెండేళ్ల కింద కుటుంబంతో వచ్చినం. ఇండ్లు కట్టే కాడ కూలీకి పోతున్న. మాఆయన నేను కలిసి రోజుకు రూ. 1500ల పని చేస్తున్నం. మాఊరిలో ఇంత కూలీ రాదు. ఆరునెలల కోసారి మాఊరికి పోయి 15రోజులుండి మళ్లీ వచ్చి పనిచేసుకుంటం. మాఊరోల్లు 60 మంది ఉన్నరు. అందరు బిల్డింగ్ పని చేస్తుండ్రు. ఈజిల్లాలోనే ఇంకో ఊరిలో పనిచేస్తున్నరు. పనిచూసిపెడితే చాలా మంది వస్తామంటు మాకు ఫోన్ చేస్తుండ్రు.
-లక్ష్మీబాయి, కూలీ, మధ్యప్రదేశ్
రెండు వేల మంది కూలీలు
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బిహార్, ఒడిశా నుంచి ఉపాధి లేక పొట్టచేత బట్టుకుని తెలంగాణకు వేల సంఖ్యలో కూలీలు వలస వస్తున్నారు. ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు రెండువేలకు పైగా కూలీలు ఉపాధి పొందుతున్నారు. మరమగ్గాలు, వ్యవసాయం, భవన నిర్మాణం, స్టోన్ క్రషర్, ఇటుక బట్టీలు, టెక్స్టైల్స్ పార్కులో పనిచేస్తున్నారు. అక్కడి రాష్ర్టాలలో వారంలో మూడు రోజుల పనిమాత్రమే లభిస్తే మన జిల్లాలో నిరంతరం పనిదొరుకుతుందని అక్కడి కూలీలు చెపుతున్నారు. అక్కడ కేవలం నెలకు 6 వేలు మాత్రమే సంపాదించవారమని, ఇక్కడ నెలకు 15 వేల నుంచి 18 వేల వరకు ఆర్జీస్తున్నామని పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ దయవల్ల మేము రెండు పూటల కడుపు నిండా తింటున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడే పని మంచిగున్నది..
బిహార్కు చెందిన మేం 102 మంది బ్యాచ్ ఉన్నం. నాలుగేళ్ల కింద ఇక్కడికి వచ్చినం. మాఊరిలో సరిగా పని దొరకదు. హమాలీ పనిచేసి ముల్లెలు మోసినా నెలకు రూ. ఆయిదారు వేలు రావు. మంచిగ పనిచేస్తే ఇక్కడ నెలకు రూ. 15వేల నుంచి రూ. 18వేలు వస్తున్నయ్. మొన్నటి దాకా రైస్మిల్లులో పనిచేసినం. ఇప్పుడు వడ్ల కొనుగోలు సెంటర్లలో సంచుల్లో వడ్లు నింపి లారీలో ఎక్కిస్తున్నం. ఇక్కడ పనిమంచిగున్నది.
-అశోక్, కూలీ, బిహార్
బతుకు దెరువుకు వచ్చినం
మాది ఉత్తర ప్రదేశ్. అక్కడ పనిలేక చాలా మంది ఎక్కడికో పోయి బ తుకుతున్నరు. 20 మందిమి ఇక్కడికొచ్చి మూడేళ్లయ్యింది. ఇక్కడ చేసుకున్నంత పని ఉన్నది. పన్నెండు గంటలు కష్టపడుతున్నం. అక్కడి కంటే కూలీ ఇక్కడే ఎక్కువ ఉన్నది. మాభార్య పిల్లలను ఇక్కడికే తెచ్చుకుని ఉండాలనుకుంటున్నం. పిల్లలను చదివించాలంటే తెలుగు రాదన్న ఇబ్బంది ఒక్కటే ఉంది. కేసీఆర్ సారు ఉన్నన్ని రోజులు మాకు చేతినిండా పని ఉంటదన్న నమ్మకం ఉన్నది.
-అభిలాష్, కూలీ, ఉత్తర ప్రదేశ్