తిమ్మాపూర్ రూరల్, జనవరి 5: సర్కారు దవాఖాన అంటే వైద్యానికే అడుగుపెట్టని ప్రజలు.. సీఎం కేసీఆర్ తెచ్చిన పెను మార్పులతో వైద్యారోగ్య కేంద్రాలకు రావడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు క్రమం తప్పకుండా నెలనెలా పరీక్షలు చేయించుకునేందుకు పీహెచ్సీకి వస్తుంన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వైద్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణులకు ఆరోగ్యలక్ష్మీ పథకం కింద ఒకపూట సంపూర్ణ భోజనం అందజేస్తున్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక శ్రద్ధతో కేవలం కరీంనగర్ జిల్లాలోని పీహెచ్సీల్లో మాత్రమే గర్భిణులకు భోజనం పెడుతున్నారు.
రెండు మండలాల్లో..
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని పీహెచ్సీకి తిమ్మాపూర్ మండలంతో గన్నేరువరం మండలం నుంచి ప్రతి సోమవారం, శుక్రవారం గర్భిణులు చికిత్స చేయించుకునేందుకు వస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మీ కింద ఒకపూట పెడుతున్న సంపూర్ణ భోజనం సంతృ ప్తినిస్తున్నది. ఒకరికి అన్నంతోపాటు పాలు, పప్పులు, గుడ్డులాంటి పౌష్ఠికాహారం అందజేస్తున్నారు. ప్రతి వారం సుమారు 20 నుంచి 30 మంది చికిత్స పొందుతుండగా, స్థానిక అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐసీడీఎస్ అధికారులు భోజనాలు సమకూరుస్తున్నారు.
అభినందించిన సెంట్రల్ టీం..
గర్భిణిగా అంగన్వాడీ కేంద్రంలో నమోదైన తర్వాత ప్రభుత్వం వారికి పౌష్ఠికాహారాన్ని అందజేస్తున్నది. అయితే పరీక్షల నిమిత్తం పీహెచ్సీకి వచ్చినప్పుడు ఇబ్బందులు కలుగుతున్నాయని కలెక్టర్ ఆర్వీకర్ణన్ ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాలోని పీహెచ్సీల్లో ఆరోగ్య లక్ష్మీని అమలు చేయిస్తున్నారు. దీనిపై జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర అధికారుల బృందం పీహెచ్సీని సందర్శించి అధికార యంత్రాంగాన్ని అభినందించింది.