యాసంగిలో ఆరుతడి పంటలకే నీళ్లిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎల్ఎండీ దిగువ ఆయకట్టుకే అందే అవకాశాలున్నాయి. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుండగా, గత వానకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం, ప్రాజెక్టుల్లోకి నీళ్లు రాకపోవడమే అందుకు కారణంగా కనిపిస్తున్నది.
అయితే, పోయిన యాసంగి సీజన్లో అటు మిడ్మానేరు, ఇటు దిగువమానేరు జలాశయాలను కాళేశ్వరం జలాలతో నింపినా.. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఫలితంగా ఆరుతడి పంటలకే నీళ్లిచ్చే చాన్స్ ఉన్నది. ఇటీవల హైదారాబాద్లో జరిగిన ‘శివం’ సమావేశంలోనూ అధికారులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. కాగా, రెండు మూడు రోజుల్లో జిల్లా స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
– కరీంనగర్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ
కరీంనగర్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎల్ఎండీ జలాశయం దిగువ ఆయకట్టుకు ఈసారి పూర్తి స్థాయిలో సాగు నీరు అందే అవకాశాలు కనిపించడం లేదు. ఎస్సారెస్పీలో ఉన్న నీరు ఎగువ ఆయకట్టుకే సరిపోయే పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. దిగువ ఆయకట్టు పరిధిలో ఎంత సాగు అవుతుంది? నీరు ఎంత అవసరం ఉంటుందనేది అధికారులు ఇప్పటికైతే ఒక అంచనాకు రాలేదు.
ప్రస్తుతం శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్లో 23.17 టీఎంసీలు, దిగువ మానేరు జలాశయంలో 19.53 టీఎంసీలు కలిపితే 42 టీఎంసీల నీరు ఉన్నది. అందులో తాగునీరు, ఇతర అవసరాలకుపోను 25 టీఎంసీల వరకే దిగువ ఆయకట్టుకు ఇవ్వచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరుతడి పంటలకే సాగు నీరు అందించాలని సూచన ప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ నెల 13న హైదరాబాద్లో జరిగిన శివం సమావేశంలోనూ ఇదే విషయమై చర్చించినట్లు సమాచారం.
ఎస్సారెస్పీ పరిధిలోని దిగువ మానేరు జలాశయం స్టేజ్ -1లో కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో 5,05,720 ఎకరాలు, స్టేజ్-2లో ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలో మరో 3.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇప్పుడు స్టేజ్-1 పరిధి వరకు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇందులో ఆరుతడి పంటలకైతే 5 లక్షల ఎకరాల వరకు, తరి పంటలకైతే 3 లక్షల ఎకరాల వరకే సరిపడా నీరు అందుబాటులో ఉన్నదని అధికారులు చెబుతున్నారు. ఎస్సారార్, ఎల్ఎండీ జలాశయాల నుంచి 25 టీఎంసీలు మాత్రమే సాగు నీటికి వాడుకునే వీలుండడంతో ఆరుతడి పంటల సాగుకే రైతులు మొగ్గు చూపాలని సూచిస్తున్నారు.
యాసంగిలో సాగునీటి విడుదల ఎప్పుడనేది త్వరలో జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించి నిర్ణయిస్తామని ఎస్సారెస్పీ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఎస్సారెస్పీ పరిధిలోని సాగు నీటిని సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్న నీరుపారుదల శాఖ ఉన్నతాధికారులు తిరిగి జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో సమావేశాలు నిర్వహించుకుని నీటిని ఎప్పుడు విడుదల చేసేది నిర్ణయించుకోవాలని సూచించినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు అనుమతితో మూడు నాలుగు రోజుల్లో సమావేశం నిర్వహించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. జనవరి మొదటి వారంలోనే నీటి విడుదల ఉండే అవకాశమున్నది.