సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 19: ‘పదిహేడేండ్ల పోరాటం ఫలించింది. మనోళ్లకు దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టింది. వారిని ఇంటికి తోలుకస్త. ఈ నెలఖారుకల్లా వస్తరు. ఫ్లయిట్ టికెట్లు తీసుకొని, అవసరమైతే నేను దుబాయ్ పోయి తీసుకొస్త. మీరేం బాధపెట్టుకోవద్దు’ అంటూ దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టిన బాధితుల కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా కల్పించారు. ఈ మేరకు సోమవారం ఓ మీడియా ప్రతినిధి సాయంతో వారితో మాట్లాడారు. ఓ హత్య కేసులో దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం (48), శివరాత్రి రవి (45) అన్నదమ్ములతోపాటు కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్ (48), చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి (48), జగిత్యాల జిల్లా మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు (51)కు కేటీఆర్ కృషితో విముక్తి లభించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే దండుగుల లక్ష్మణ్ విడుదలయ్యాడు. మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు రెండ్రోజుల క్రితమే స్వదేశానికి వచ్చాడు. అలాగే పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి రెండ్రోజుల కింద విడుదల కాగా, ఈ నెలాఖరుకల్లా స్వదేశానికి రానున్నారు. మరో వ్యక్తి నాంపెల్లి కూడా త్వరలోనే విడుదలై రాబోతున్నాడు. ఈ క్రమంలో సోమవారం పెద్దూరుకు చెందిన శివరాత్రి రవి, మల్లేశం కుటుంబసభ్యులతో ఓ మీడియా ప్రతినిధి ద్వారా కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. కేటీఆర్ మాటలను విన్న మల్లేశం తల్లి గంగవ్వ కన్నీటి పర్యంతమైంది. ‘సార్ మీ దయతోనే కొడుకుల కండ్ల చూడబోతున్నం. చాలా సంతోషంగ ఉన్నది. మీ మేలు ఎన్నిటికీ మరువం’ అంటూ కృతజ్ఞతలు తెలిపింది. ‘మన పోరాటం ఫలించింది. మనోళ్లను వెనక్కు తీసుకొస్త. స్వయంగా ఎయిర్పోర్టుకు వస్త. మీ కొడుకులను మీకు అప్పజెప్పుత’ అని మంత్రి ఫోన్లో భరోసానిచ్చారు.