కార్పొరేషన్, ఏప్రిల్ 30: నగర అభివృద్ధిపై మేయర్ వై సునీల్రావుతో పాటు పాలకవర్గ సభ్యులు, అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ల ఏర్పాటుతో పాటు వాకింగ్ ట్రాక్లు నిర్మించారు. అలాగే, అన్ని డివిజన్లలో మురుగు కాలువలు, సీసీ రోడ్లు, వైకుంఠధామాల నిర్మాణంతో పాటు ప్రధాన చౌరస్తాలు, పార్కు స్థలాలను సుందరీకరిస్తున్నారు. మూడేళ్లలో నగరంలోని ఆయా డివిజన్లలో ఉన్న పార్కులను స్థానికుల అవసరాలు, ఉన్న స్థలాన్ని దృష్టిలో పెట్టుకొని పచ్చదనం, సాయంత్రం ప్రజలు సేద తీరేలా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న పట్టణ ప్రగతి నిధులతో పార్కులు, శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వడంతో కరీంనగర్లోని పార్కులకు మహర్దశ పట్టింది. ఇందులో భాగంగా నగరంలో రూ.3.09 కోట్లతో 13 పార్కులను అభివృద్ధి చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. వీటిలో ఇప్పటికే పలు పార్కులు ప్రజలకు అందుబాటులోకి రాగా, మరికొన్ని పార్కుల సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని పార్కుల పనులు ఇంకా ప్రారంభించాల్సి ఉంది.
నిత్యం బిజీబిజీ జీవితం నుంచి నగర ప్రజలకు ప్రశాంతత, ఆహ్లాదం కల్పించేందుకు నగరపాలక సంస్థ పలు డివిజన్లలో పార్కులను ఏర్పాటు చేస్తున్నది. గత పాలకవర్గం సీఎం హామీ నిధులు రూ. 5 కోట్లు, అమృత్ నిధులు రూ. 3.70 కోట్లతో జడ్పీ క్వార్టర్స్లోని పార్కును, జ్యోతినగర్లోని కేడీఆర్ పార్కును అభివృద్ధి చేశారు. కాగా, ప్రస్తుత పాలకవర్గం రూ.3.09 కోట్లతో 13 పార్కు స్థలాల సుందరీకరణకు చర్యలు చేపట్టింది. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయగా, కొన్ని పార్కుల్లో పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా పార్కుల్లో పచ్చదనంతో పాటు కూర్చోవడానికి బెంచీలు, వాకింగ్ ట్రాక్, పూల మొక్కలు, పిల్లలు ఆడుకోవడానికి పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.3.09 కోట్లతో 13 ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. వీటిలో హౌసింగ్బోర్డు కాలనీలో రెండు, 8వ డివిజన్లోని తమిళకాలనీ, అలకాపురి కాలనీలో, కట్టరాంపూర్లో, శాంతినగర్లో, సప్తగిరికాలనీలో, రాజీవ్ పార్కు, 15వ డివిజన్లో, పద్మనగర్లో రెండు, వ్యాలీహోం కాలనీలో, కశ్మీర్గడ్డలోని పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే హౌసింగ్బోర్డు కాలనీలో ఒకటి, 12వ డివిజన్లోని శాంతినగర్, సప్తగిరికాలనీ, 14 డివిజన్లోని పార్కు పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరో మూడు పార్కుల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మరో 6 పార్కుల అభివృద్ధి పనులు ప్రారంభించాల్సి ఉంది. వీటితో పాటు కొత్తగా మరో 15 పార్కులను రూ. 4.5 కోట్లతో అభివృద్ధి చేసేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. గడువులోగా పార్కుల అభివృద్ధి పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు కృషి చేస్తున్నారు.
నగరంలోని పార్కు స్థలాలను అభివృద్ధి చేయడంతో ఉదయం, సాయంత్రం కుటుంబసభ్యులతో వెళ్లి ఆహ్లాదంగా గడుపుతున్నం. ఉమ్మడి రాష్ట్రంలో పార్కు స్థలాల్లో బోర్డులు మాత్రమే ఉండేవి. చెత్తతో నిండి కూర్చోవడానికి వీలు లేకుండా పోయేది. ప్రస్తుతం అభివృద్ధి చేయడంతో ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడంతో పాటు కాసేపు సేద తీరుతున్నం. -ఆదిరెడ్డి, కరీంనగర్
ఆయా డివిజన్లలోని పార్కు స్థలాలను బల్దియా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడంతో స్థానికులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఉదయం, సాయంత్రం వెళ్లి వాకింగ్ చేస్తున్నం. నగర అభివృద్ధితో పాటు ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు పార్కు స్థలాలను సుందరంగా తీర్చిదిద్దుతున్న మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు.
– కరుణాకర్, కరీంనగర్
పార్కుల్లో పచ్చదంతో పాటు పిల్లలు ఆడుకోవడానికి క్రీడా పరికరాలు, కూర్చోవడానికి వివిధ ఆకారాల్లో బేంచీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఆధ్వర్యంలో పార్కుల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో శుభ్రంగా ఉంటున్నయి. పార్కులను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావడంతో స్థలాలు ఆక్రమణకు గురికాకుండా ఉంటున్నాయి. – తిరుపతి, కరీంనగర్
నగరంలోని పలు పార్కుల్లో అభివృద్ధి పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చినం. పార్కు స్థలాలను సంరక్షించడంతో పాటు స్థానికుల సూచనల మేరకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. ముఖ్యంగా ప్రతి పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుతో పాటు ఆకర్షణీయంగా ఉండేలా వివిధ ఆకరాల్లో ఉండే బేంచీలు ఏర్పాటు చేస్తున్నం.
– యాదగిరి సునీల్రావు, మేయర్