ఎగువ మానేరు ప్రాజెక్టు నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్మానేరు) వరకు నదీ తీర ప్రాంత రైతులకు మళ్లీ నీటి కష్టాలు మొదలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో నాలుగైదేళ్లుగా యాసంగి సాగుకు ఢోకా లేకుండా పోగా, ఈ సీజన్లో వాగులో నీళ్ల ప్రవాహం లేక భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. తొమ్మిది చెక్ డ్యాంలకు దాదాపు నాలుగు ఎండిపోగా, మరో పది పదిహేను రోజుల్లో మిగతావి కూడా అడుగంటే ప్రమాదమున్నది. వీటి పరిధిలో వేలాది ఎకరాలు ఎండిపోయే ముప్పు ఉండగా, కర్షకలోకంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నది. సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని వేడుకుంటున్నది.
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 24 : కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత మానేరు తీర రైతులకు నీటి కష్టాలు దూరమయ్యాయి. మల్లన్నసాగర్ నుంచి గతేడాది వరకు యాసంగిలోనూ కూడెల్లి వాగు ద్వారా నీళ్లు ఇవ్వడంతో ఎగువ మానేరు ప్రాజెక్టు నిండి 13 వేల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లు వచ్చాయి. అలాగే, మానేరువాగుపై తొమ్మిది చెక్డ్యాంలు సజీవంగా మారి, సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉబికి వచ్చాయి. ఫలితంగా బోర్లు, వ్యవసాయ బావుల కింద పుష్కలంగా పంటలు పండాయి. నాలుగేళ్లపాటు యాసంగికి ఏ ఢోకాలేకుండా పోయింది. కానీ, ప్రస్తుతం మానేరు తీరం వెంట భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.
ఆశించిన స్థాయిలో నీళ్లు రాక చాలా వరకు చెక్డ్యాంలు వెలవెలబోతున్నాయి. పదిర, రాగట్లపల్లి, వెంకటాపూర్, సర్దాపూర్ చెక్డ్యాంలు దాదాపుగా అడుగంటాయి. మిగతా ఐదు చోట్ల అంతో కొంత నీళ్లున్నా.. పై నుంచి నీళ్లు రాకపోతే అవి కూడా ఎండిపోనున్నాయి. ఇటు చెరువులు, కుంటలు కూడా కళతప్పుతున్నాయి. దీంతో పరీవాహక ప్రాంతంలోని పంటలు దెబ్బతినే ముప్పున్నది. ప్రధానంగా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లోని మానేరు వాగు పరీవాహక ప్రాంత గ్రామాలైన బండలింగంపల్లి, సింగారం, పదిర, హరిదాస్నగర్, ఆవునూరు, రామలక్ష్మణులపల్లె, వెంకటాపూర్ పరిధిలో 2500లకుపైగా ఎకరాలు బోరుబావుల ద్వారా సాగవుతుండగా, ఇప్పుడవి ఎండిపోయే ప్రమాదం కనిపిస్తున్నది. మరో పదిహేను రోజులు ఇలాగే ఉంటే చేతికొచ్చిన పంటలు కండ్ల ముందే ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు ఇచ్చి పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు.
ఎవరి మీదనో కోపం రైతు మీద సూపియ్యకున్రి. ఎట్లనన్న జేసి నీళ్లిడిసి రైతును కాపాడున్రి. మూడేండ్ల సంది లేని తిప్పలు ఇప్పుడే ఎందుకచ్చినయో అర్థంకాలె. ఇంకా పదిహేను రోజులు గిట్లనే ఉంటే పొలాలన్నీ ఎండి రైతులు రోడ్లమీదికచ్చే పరిస్థితి ఉంది. ఇన్నేండ్లు కరెంటు, నీళ్లకు తిప్పలు లేకుంట ఉన్నం. బాధలు పోయినయనుకుంటే మల్ల రైతులు గోసపడేటట్టు కనవడుతున్నది. దయచేసి మా పొలాలకు నీళ్లిచ్చి ఆదుకోవాలె.
– గుల్లపల్లి నారాయణరెడ్డి, రైతు, పదిర (ఎల్లారెడ్డిపేట)