శంకరపట్నం, నవంబర్ 2: ’అభివృద్ధి చేస్తుందెవరో.. అభివృద్ధి నిరోధకులెవరో ప్రజలు ఆలోచించాలి.. తెలంగాణలో ఉన్నన్నీ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు.. అడగకుండానే వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినం.. కాంగ్రెస్ను నమ్మి మోసపోవద్దు.. కారు గుర్తుకు ఓటేసి విజయాన్ని కట్టబెట్టాలి’ అని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజలను అభ్యర్థించారు. ప్రతీ గ్రామంలో అన్ని కులాలకు కమ్యూనిటీ భవనాలతో పాటు దాదాపు 90 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. గురువారం శంకరపట్నం మండలంలోని రాజాపూర్, కన్నాపూర్, ధర్మారం గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రసమయి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మాట్లాడారు. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా చేసిన ఏకైక నాయకుడు కేసీఆరే అన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ను మళ్లీ సీఎం చేస్తే ఒంటరి, వితంతు మహిళలతో సహా ఆసరా పింఛన్లను 5016కు పెంచుతామన్నారు.
20-57 ఏండ్ల మహిళలందరికీ 3000 పింఛన్ అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మీని 2,00,116కు పెంచనున్నట్లు వెల్లడించారు. తెల్ల రేషన్కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి 5 లక్షల బీమా ఇస్తామని తెలిపారు. 400కే వంట గ్యాస్, రైతుబంధును ఎకరాకు 10 వేల నుంచి 16 వేలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు.
అన్ని గ్రామాల్లో దళితబంధు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గృహలక్ష్మీలో భాగంగా రూ.3 లక్షలు అందజేస్తామన్నారు. అర్హులైన బీసీలకు బీసీబంధు కొనసాగిస్తామన్నారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ అభివృద్ధిపై ధ్యాస పెట్టలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ను నమ్మి ఓటు వేస్తే తిరిగి 60 ఏండ్లు వెనకకు వెళ్తామని హెచ్చరించారు. గ్రామాల్లో రసమయికి డప్పులు, కోలాటాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కన్నాపూర్లో పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ప్రచారంలో జడ్పీటీసీ ఎల్ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్, సర్పంచులు పిన్రెడ్డి వసంత, కాటం వెంకటరమణారెడ్డి, చుక్కల రవి, ఎంపీటీసీలు మోతె భాగ్యలక్ష్మి, మాతంగి లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ సంజీవరెడ్డి, సీనియర్ నాయకుడు ఉమ్మెంతల సతీశ్రెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు అలీమొద్దీన్, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.