నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సిరిసిల్ల పట్టణం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో పట్టణం సరికొత్తగా మారింది. ఏవార్డులో చూసినా సీసీరోడ్లు, ఆరు వరుసల కేకే, ఎస్ఎస్ రోడ్లు, రింగురోడ్లను తలపించే విధంగా రెండు బైపాస్లతో అద్భుతంగా రూపొందింది. ఒకప్పుడు కుటుంబ సభ్యులతో షికారుకు వెళ్లలేని పరిస్థితి ఉండగా, ప్రస్తుతం కొత్త చెరువును మినీట్యాంక్ బండ్గా తీర్చి దిద్దడం, మానేరులో బతుకమ్మ ఘాట్, వెంకటాపూర్లో అర్బన్ ఫారెస్టు పార్కుల ఏర్పాటు, వార్డుల్లో మినీ పార్కులతో ప్రజలు తమ ఇండ్ల సమీపంలోనే అహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు.
– రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ)
నాడు సిరిసిల్ల పట్టణానికి ఏకైక పెద్దవాగుగా చెప్పుకునే మానేరువాగు పెద్ద పేగు ఎండి పోయి ఎడారిగా మారింది. వర్షాధార ప్రాజెక్టుగా చెప్పుకునే నర్మాల ఎగువ మానేరు నిండి మత్తడి దూకిన నీటితోనే వాగులో నీరు కనిపించేది. తీవ్ర కరువు దుర్భిక్షంతో కొట్టుమిట్టాడిన మెట్ట నేలను గోదావరి జలాలతో అభిషేకిస్తానంటూ మంత్రి కేటీఆర్ ఆనాడు ఇచ్చిన మాటను నెరవేర్చారు. మాన్వాడ వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన శ్రీరాజరాజేశ్వర జలాశయం (ఎస్సారార్)తో సిరిసిల్ల పట్టణంలోని బ్రిడ్జి వరకు గోదావరి జలాలు ఎదురెక్కి, బతుకమ్మ ఘాట్ వద్ద గంగమ్మను తాకాయి. వాగులో కేవలం వానకాలంలోనే కనిపించే నీళ్లు ఎస్సారార్ జలాశయంతో ఏడాది పొడవునా నిల్వ ఉంటున్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 11, 12 ద్వారా మల్లన్న సాగర్ నుంచి ఎగువ మానేరుకు గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. 32 అడుగుల ఎత్తు ఉన్న నర్మాల ప్రాజెక్టులోకి మూడేళ్లుగా గోదావరి జలాలు భారీగా చేరుతున్నాయి. మండుటెండల్లో మత్తడి దూకి ఎస్సారార్ జలాశయంవైపు పరుగులు తీస్తున్నాయి. దీంతో 50 కిలోమీటర్ల పొడవునా భూగర్భజలాలు ఉబికి రావడమే కాకుండా, రెండు వైపులా పచ్చదనం పరుచుకుంటున్నది.
అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న మంత్రి కేటీఆర్ కార్మిక క్షేత్రానికి పర్యాటక శోభను తెచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. దాదాపు 70 కోట్లతో రామప్ప గుట్టల నుంచి బ్రిడ్జి వరకు కరకట్టను నిర్మించారు. వాగు పక్కనే ఉన్న పంట చేలకు నష్టం కలుగకుండా కరకట్టను నిర్మించారు. బ్రిడ్జి నుంచి సాయిబాబా ఆలయం వరకు కుడివైపు మరో కరకట్ట నిర్మిస్తున్నారు. సుమారు మూడు కిలో మీటర్ల పొడవు, 60 ఫీట్ల వెడల్పుతో వాగు ఒడ్డున నిర్మిస్తున్న కరకట్ట కోసం తొలి విడుతగా 30 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. కరకట్టపై పార్కులు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, యోగా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. బతుకమ్మ ఘాట్, అంబాభవానీ, సాయిబాబా ఆలయాలు, బ్రిడ్జి సమీపంలో పార్కుల ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తున్నారు. ఆలయాలకు వచ్చే భక్తులు కొంత సేపు సేద తీరేలా పార్కులకు రూపకల్పన చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వరంగల్ భద్రకాళీ చెరువు మాదిరిగా బతుకమ్మ ఘాట్ వద్ద పెద్ద పార్కును ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇరిగేషన్, పర్యాటక శాఖ అధికారులు గత ఆరు నెలల కింద సిరిసిల్లను సందర్శించారు. మానేరు తీరంలో పార్కులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో స్థలాలను పరిశీలించారు. సాయిబాబా గుడి నుంచి బతుకమ్మ ఘాట్ వరకు కరకట్ట పనులు శరవేగంగా సాతుండగా, అక్కడి నుంచి బ్రిడ్జి వరకు పనులు చేపట్టాల్సి ఉన్నది. పర్యాటక, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.
పండుగల వేళ మానేరు నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు ప్రత్యేక పుష్కర ఘాట్లు నిర్మించనున్నారు. ధర్మపురి, కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం లేకుండా పట్టణ ప్రజలకు అందుబాటులో ఉన్న మానేరులోనే స్నానాలు, మొక్కులు తీర్చుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. నదిలోకి దిగేందుకు కరకట్ట వద్ద మెట్లు నిర్మించనున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.