దశాబ్దాలుగా అరకొర వసతులతో అవస్థలు పడ్డ పత్తిపాక పాఠశాల నేడు తన రూపురేఖలు మార్చుకున్నది. ‘మన ఊరు – మన బడి’తో సరికొత్తగా తయారైంది. తరగతి గదుల్లో విద్యుత్ వెలుగులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, అధునాతన సౌకర్యాలతో నయా లుక్ సంతరించుకున్నది. తరగతి గదులకు కొత్త రంగులు, డైనింగ్ హాల్, విద్యార్థులు చేతులు కడుక్కునేందుకు నల్లాలు, అధునాతన టాయిలెట్లు, విశాలమైన వంట గదులు.. ఇంకా చుట్టూ ప్రహరీ నిర్మాణంతో అందంగా తయారైంది. రెండు రోజుల క్రితమే మంత్రి, కలెక్టర్ చేతులమీదుగా ప్రారంభించడంతో విద్యార్థి లోకం సంబురపడుతున్నది.
– ధర్మారం, ఫిబ్రవరి 8
ధర్మారం, ఫిబ్రవరి 8: పత్తిపాక జడ్పీ స్కూల్కు ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్కూల్ రానురాను వసతుల లేమితో కొట్టుమిట్టాడింది. వానస్తే చాలు తరగతి గదులు ఉరుస్తూ ఉండేవి. మూత్రశాలలు, నీటి వసతి కూడా లేకపోయింది. ఇంకా క్లాస్రూమ్స్ సైతం అధ్వానంగా ఉండేవి. ఈ క్రమంలో స్వరాష్ట్రంలో రాష్ట్ర సర్కారు పాఠశాల అభివృద్ధిలోకి తెచ్చింది. తాజాగా కార్పొరేట్ను తలదన్నేలా తీర్చిదిద్దింది. మన ఊరు మన బడిలో భాగంగా మొదటి విడుత పత్తిపాక జడ్పీ స్కూల్ను ఎంపిక చేసింది. 24, 41, 873 మంజూరు చేయగా, సర్పంచ్ బద్దం సుజాత రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. తరగతి గదుల్లో విద్యుద్దీకరణతో పాటు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, పిల్లలు కూర్చునేందుకు డ్యుయెల్ డెస్క్లు ఏర్పాటు చేశారు. అన్ని గదులను మరమ్మతు చేసి పెయింటింగ్ వేయించారు.
డిజిటల్ బోధన కోసం మూడు తరగతి గదుల్లో ప్రొజెక్టర్లను ఏర్పాటు చేశారు. ఇంకా విద్యార్థులు భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ నిర్మించారు. స్కూల్ ఎంట్రెన్స్లో గేటు ఏర్పాటు చేయించడమే కాదు స్వాగత తోరణం కూడా నిర్మించడంతో కొత్త లుక్ వచ్చింది. తాగు నీటి కోసం ప్రత్యేకంగా ఒక బ్లాక్ను ఏర్పాటు చేసి ట్యాప్లు అమర్చారు. వీటికి తోడు రూ.61 లక్షల ఉపాధి హామీ నిధులతో స్కూల్ చుట్టూ ప్రహరీ నిర్మించి పెయిటింగ్ వేయించారు. ఇలా సకల వసతులతో స్కూల్ను కార్పొరేట్ను తలదన్నేలా తీర్చిదిద్దారు. కాగా, ఇటీవలే మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ సంగీత సత్యనారాయణ, డీఈవో మాధవి కలిసి పూర్తయిన పనులకు ప్రారంభోత్సవం చేశారు. కాగా స్కూల్లో సకల వసతులు కల్పించడంతో విద్యార్థులు ఉత్సాహంగా అభ్యసిస్తున్నారు.
పాఠశాలలో మారిన దశ
మన ఊరు – మన బడి కింద మా బడి దశ మారింది. అతి తక్కువ టైంలోనే మా స్కూళ్లలో మెరుగైన వసతులు సమకూరడం ఒక వరం. ఈ సౌకర్యాలను చూసి ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతోషపడుతున్నారు. డైనింగ్ హాల్ నిర్మించడంతో పిల్లలు ఆరు బయట కూర్చుని తినే తిప్పలు తప్పాయి. అధునాతన టాయిలెట్స్ నిర్మించారు. స్వచ్ఛమైన మంచినీటి వసతి కల్పించి నల్లాలు ఏర్పాటు చేశారు. డిజిటల్ తరగతుల నిర్వహణ స్కూల్కే వన్నెతెచ్చిందని చెప్పవచ్చు.
– పీఎం షేక్, హెచ్ఎం, పత్తిపాక జడ్పీ స్కూల్