గంగాధర, ఆగస్టు 24 : స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న సర్కారు బడిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయా కల్పన కోసం నిధులు కేటాయించింది. ప్రస్తుతం పనులు పూర్తి కావడంతో సర్కారు బడికి కొత్త కళ వచ్చింది.
గంగాధర జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం రూ. 22,46,688 మంజూరు చేసింది. పాఠశాలలో మరమ్మతులకు రూ. 4,03,841 కేటాయించారు. తరగతి గదుల్లో ఫ్లోరింగ్, విరిగిపోయిన తలుపులు, కిటికీల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆరుబయట భోజనం చేయమడానికి ఇబ్బంది పడకుండా రూ. 13,98,859తో పాఠశాల ఆవరణలో డైనింగ్ హాలు నిర్మించారు. రూ.3,35,477 పాఠశాలలో వైరింగ్ చేయించారు. ఫ్యాన్లు, బల్బులు, ఏర్పాటు చేశారు. రూ. 1,08,511తో తాగునీటి సౌకర్యం కల్పించారు. నీటి కోసం సంపు నిర్మించారు. వాటర్ ట్యాంకు, పైపులైన్, విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకోవడానికి నల్లాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సాంకేతిక విద్యనందిచడానికి తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు.
గంగాధర ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ. 8,28,931 నిధులు మంజూరు చేసింది. మరమ్మతులకు రూ. 5,92, 399 కేటాయించగా విరిగిపోయిన తలుపులు, కిటికీల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. గ్రానైట్తో తరగతి గది ముందు మెట్లు ఏర్పాటు చేశారు. రూ.1,75,845తో వైరింగ్, ఫ్యాన్లు, బల్బులు, ఏర్పాటు చేశారు. రూ. 59,849తో తాగునీటి సౌకర్యం కల్పించారు. చేతులు శుభ్రం చేసుకోవడానికి నల్లాలు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో నూతనంగా బెంచీలు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు.
గంగాధర పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం మన ఊరు -మన బడి కింద ప్రభుత్వం రూ.22,46,688 కేటాయింది. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో పాఠశాలలో తరగతి గుదుల మరమ్మతు, కరెంటు, తాగు నీటి సౌకర్యం కల్పించడానికి నిధులు ఖర్చు చేశాము. మధ్యాహ్న భోజనం చేయడానికి డైనింగ్ హాలు ఏర్పాటు చేశాం. ప్రైవేటు పాఠశాలల్లో లేని విధంగా డిజిటల్ క్లాసులను ప్రారంభించాం. ప్రస్తుతం అన్ని సౌకర్యాలతో కార్పొరేట్ బడిలా మారింది.
– తిరుపతిరావు, ప్రధానోపాధ్యాయుడు
ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మన ఊరు- మన బడితో గంగాధర ప్రభుత్వ పాఠశాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. శిధిలావస్థకు చేరుకున్న తరగతి గదులు, కరెంటు లేని పాఠశాల, తాగునీటికి ఇబ్బంది లాంటివి గతంలో సర్కారు బడిలో చూశాం. సీఎం కేసీఆర్ ‘మన ఊరు -మన బడి’తో తరగతి గదులు మెరిసిపోతున్నాయి. పాఠశాలలో డిజిటల్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. సర్కారు బడికి కొత్తరూపు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్, సహకరించిన ఎమ్మెల్యే రవిశంకర్కు కృతజ్ఞతలు.
– మడ్లపెల్లి గంగాధర్, సర్పంచ్