ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసిన మన పల్లె దవాఖాన (హెచ్డబ్ల్యూఎస్)లు అరుదైన రికార్డు సాధించాయి. నాణ్యతా ప్రమాణాలు, రోగులకు మెరుగైన వైద్య సేవలు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ విభాగాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జమ్మికుంట, జగిత్యాల జిల్లా ధరూర్, వేములకుర్తి సెంటర్లు జాతీయస్థాయి గుర్తింపు దక్కించుకున్నాయి. గత నెల 17న ఇక్కడ పర్యటించిన జాతీయ వైద్య బృందాలు, ఈ మూడు దవాఖానల్లో సేవలపై ప్రశంసలు కురిపించగా, తాజాగా నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్(ఎన్క్వాస్) సర్టిఫికెట్కు ఎంపిక చేశాయి. ఈ గుర్తింపుతో మూడేళ్ల పాటు నిధులు రానుండగా, వైద్యాధికారులు, సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
– జమ్మికుంట/ జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 22
Palle Dawakhana | జమ్మికుంట/ జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 22: మన పల్లె దవాఖానలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, జగిత్యాల జిల్లా ధరూర్, వేములకుర్తి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు ప్రశంస లభించింది. సదరు హెచ్డబ్ల్యూసీలకు త్వరలో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్(ఎన్క్వాస్) సర్టిఫికెట్ అందనుంది. జాతీయ స్థాయి గుర్తింపు పొందిన దవాఖానలకు మూడేళ్ల పాటు నిధులు, యేటా రూ.లక్షా 28వేలు (ఆయా కేంద్రాల కేటగిరిలను బట్టి) రానున్నాయి. దీంతో హెల్త్ వెల్నెస్ సెంటర్లలో అభివృద్ధికి నిధులు దోహదపడనున్నాయి.
గత నెలలో జాతీయ వైద్య బృందం సందర్శన
సర్కారు వైద్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగం ప్రజలకు చేరువైంది. ఎన్నడూలేనంతగా బలోపేతమైంది. పైసా ఖర్చు లేకుండా కార్పోరేట్కు దీటుగా ప్రజలకు అన్ని రకాల నాణ్యమైన ఉచిత వైద్య సేవలందుతున్నాయి. ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పల్లె దవాఖాన, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయగా, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతీనగర్లో, జగిత్యాల జిల్లా ధరూర్, ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో ‘పల్లె దవాఖాన’ను నిర్మించారు.
అయితే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలు, మందు నిల్వలు, రికార్డుల నిర్వహణ, ఆరోగ్య కార్యక్రమాల అమలు, పరిసరాల పరిశుభ్రత, తదితర అంశాలను పరిశీలించేందుకు జాతీయ వైద్య నాణ్యతా ప్రమాణాల సూచిక అధికారుల బృందం గత నెల 17న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించింది. పల్లె దవాఖానలకు సంబంధించిన ప్రతీ అంశాన్ని గుర్తించారు. నివేదిక తయారు చేశారు. అయితే సెంటర్ను తనిఖీ చేస్తున్న సమయంలో అధికారుల బృందం పనితీరును మెచ్చుకున్నారు. దవాఖానలకు ‘గుర్తింపు’ ఖాయమని చెప్పకనే చెప్పి వెళ్లిపోయారు.
మూడేళ్ల పాటు నిధులు..
ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్లలో వైద్యులు, సిబ్బందికి కొరత లేకుండా ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్న వైద్య సిబ్బంది నిత్యం 30 నుంచి 40 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. హెల్త్ వెల్నెస్ సెంటర్లను జాతీయ వైద్య బృందం యేటా సందర్శిస్తోంది. ఈ బృందాల పర్యటన నిరంతర ప్రక్రియగా ఉంటోంది. సెంటర్ల పనితీరుకు కేంద్రం గుర్తింపునిస్తోంది. అందులో భాగమే.. ఈ మూడు హెల్త్ వెల్నెస్ సెంటర్లకు అత్యుత్తమ సేవలు, పనితీరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. గుర్తింపుకు సంబంధించిన ప్రశంసను ఈ నెల 11న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసింది. అందులో జమ్మికుంట దవాఖాన 90శాతం స్కోరుతో టాప్లో నిలిచింది. ఇక వేములకుర్తి పల్లె దవాఖాన ఓవరాల్గా 82శాతం, ధరూర్ 79శాతం స్కోర్ సాధించినట్లు జిల్లా డిప్యూటీ వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సెంటర్లకు మూడేళ్ల పాటు నిధులు.. ఏటా రూ.లక్షా 28వేల చొప్పున సెంటర్కు రానుండగా, దవాఖానలు మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఏర్పడింది.
నాణ్యమైన సేవలకు గుర్తింపు
గతేడాది పల్లె దవాఖాన (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను) ప్రభుత్వం ఇక్కడ నిర్మించింది. మండలి విప్ కౌశిక్రెడ్డి చేతుల మీదు గా ప్రారంభించాం. వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు. నాణ్యతతో కూడిన సేవలందుతున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతున్నాం. రోగులకు ఇబ్బందుల్లేకుండా చూస్తున్నాం. పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహంతో నాణ్యమైన సేవలకు మంచి గుర్తింపు వచ్చింది. సంతోషంగా ఉంది.
– చందు, డిప్యూటీ డీఎంహెచ్వో (హుజూరాబాద్)
30కిపైగా ఓపీలు చూస్తున్నాం
జిల్లా, డివిజన్ వైద్యాధికారుల పర్యవేక్షణలో సేవలందిస్తున్నాం. ఇక్కడ దవాఖాన ఏర్పడ్డ నాటి నుంచి 30 నుంచి 40 మందికి ఓపీ చూస్తున్నాంం. మందులందిస్తున్నాం. అందుబాటులో ఉంటు న్నాం. దవాఖానను శుభ్రంగా ఉంచుతున్నాం. జాతీయ వైద్య బృందం వచ్చింది. పరిశీలించింది. నివేదిక తయారు చేసుకుని వెళ్లింది. మా సేవలకు ఫలితం దక్కింది. గుర్తింపు వచ్చింది. మరింత సేవలందించేందుకు కృషి చేస్తాం.
– డాక్టర్ మహోన్నత పటేల్, సీడబ్ల్యూసీ వైద్యురాలు (జమ్మికుంట)