మల్లాపూర్, అక్టోబర్ 28: ‘బీఆర్ఎస్ది అభివృద్ధి తోవ అయితే.. కాంగ్రెస్, బీజేపీలది అధికార యావ. ఎట్ల చేసైనా గెలవాని అన్నీ అబద్ధాలు చెబుతున్నరు. మోసపు హామీలతో మభ్య పెడుతున్నరు. నమ్మితే మోస పోతం జాగ్రత్త’ అని కోరుట్ల అభ్యర్థి సంజయ్ కల్వకుంట్ల ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుతో కలిసి మల్లాపూర్ మండలం ముత్యంపేట, హుస్సేన్నగర్, రాఘవపేట, నడికుడ, మొగిలిపేట గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడికి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టాలని కోరారు.
ఎంపీగా గెలిచిన అర్వింద్ కోరుట్ల నియోజకవర్గంలో లక్ష ఇండ్లు కట్టించారని చెబుతున్నారని, ఆ ఇండ్లు ఎక్కడ ఉన్నాయో చూపించాలన్నారు. ఎలాంటి సంస్కారం, మర్యాద లేకుండా ఇష్టానుసారంగా సీఎం కేసీఆర్పై వ్యాఖ్యలు చేయడం సరికాదని, రానున్న రోజుల్లో కోరుట్ల నియోజకవర్గ ప్రజలే తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
అలాంటి వ్యక్తికి బుద్ది రావాలంటే కోరుట్ల ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలిస్తున్న రాష్ర్టాల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నిత్యం మనం చూస్తూనే ఉన్నామని, అలాంటి పాలన మనకు అవసరమా..? ఆలోచించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వంద సీట్లకు పైగా గెలుపొందడం ఖాయమన్నారు.
ఎన్నికల వేళ గ్రామాలకు వచ్చే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లను అడగాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల డిమాండ్ చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడ ఉన్నారో ప్రజలు అడగాలన్నారు. వరుసగా తనను కోరుట్ల ప్రజలు ఆశీర్వదించి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఇప్పుడు తన కొడుకు సంజయ్ను దీవించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామాల్లోని కాలనీల్లో తిరుగుతూ ఓటర్లకు మ్యానిఫెస్టో పత్రాలను పంపిణీ చేశారు. ఇక్కడ ఎంపీపీ కాటిపల్లి సరోజన, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి దేవర సురేష్, వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, ఆర్బీఎస్ జిల్లా డైరెక్టర్ దేవ మల్లయ్య, మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఏనుగు రాంరెడ్డి, సర్పంచులు బొల్లం కృష్ణవేణి, సయ్యద్ హైదర్, నత్తి లావణ్య, భూక్య రుక్మ, వనతడపుల నాగరాజు, ఎంపీటీసీ ఓస సత్తమ్మ, గ్రామశాఖ అధ్యక్షులు చింతల రమేశ్, కరీం, సుద్దు రాజ్కుమార్, మహేశ్, జెల్ల ప్రసాద్ పాల్గొన్నారు.