గంగాధర, జనవరి 13: గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి వీరభద్రస్వామి ఆలయ 32వ వార్షికోత్సవాలు ఈనెల 14వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి వారి జాతరను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
కోరిన కోర్కెలు తీర్చే కోరమీసాల వీరభద్రస్వామి సన్నిధికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వార్షికోత్సవాల్లో భాగంగా ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ తోట కవిత తెలిపారు. ఆలయ వార్షికోత్సవాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.