మైనార్టీ యువతకు కాంగ్రెస్ సర్కారు మొండి చేయి చూపుతున్నది. అధికారంలోకి వస్తే వంద శాతం సబ్సిడీతో ఉపాధి కల్పన పథకాలు ప్రవేశపెడుతామంటూ మేనిఫెస్టోలో ప్రకటించి, ‘ఓడ దిగినంక బోడ మల్లన్న’అన్నట్టుగా వ్యవహరిస్తున్నదని మైనార్టీల్లో ఆగ్రహం వ్యక్తమవు తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలాది మందికి వంద శాతం సబ్సిడీపై ఉపాధి పథకాలు మంజూరు చేసి వెలుగు నింపిందని, కాంగ్రెస్ మాత్రం నమ్మించి నిండా ముంచిందని మండిపడుతున్నది. వెంటనే సబ్సిడీ రుణాలు అందించాలని కోరుతున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, డిసెంబర్ 26 : నాలుగేండ్ల క్రితం నుంచి గతేడాది వరకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్ల నిధులు కేటాయించింది. 2018-19లో చిన్నతరహా ఉపాధి పరిశ్రమల ఏర్పాటుకు వంద శాతం సబ్సిడీతో వందలాది మందికి 50వేల చొప్పున అందజేసింది. అలాగే, గతేడాది కూడా వందశాతం సబ్సిడీతో లబ్ధిదారులకు పథకాలు మంజూరు చేశారు. కరీంనగర్ జిల్లాలో 6వేలకు పైగా దరఖాస్తులు రాగా, నాలుగు వేల వరకు పరిశీలించి, అర్హులను ఎంపిక చేసి, మూడు విడుతల్లో ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. మొదటగా 174 మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున సబ్సిడీ రుణాలు పంపిణీ చేశారు.
రెండో విడుతలో మరికొంత మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పంపిణీకి తాత్కాలిక బ్రేక్ పడింది. ఎన్నికల అనంతరం రుణాలు విడుదల చేస్తామంటూ గత ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అంతకు రెండింతల రుణం వందశాతం సబ్సిడీతో తాము అందజేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. మేనిఫెస్టోలో పొందుపరిచారు. కానీ, అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇప్పటివరకు మైనార్టీలకు ఉపాధి కల్పనపై నోరు విప్పకపోవడంతో మైనార్టీ యువత ఆక్రోశం వెల్లగక్కుతున్నది. మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఒబేదుల్లా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇచ్చిన మాట నిలుపుకునేందుకు కృషి చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ సర్కారు మైనార్టీల అభివృద్ధి కోసం చేసిన కృషిని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాలి. గతంలో వందలాది మంది మైనార్టీలు సబ్సిడీ రుణాలు తీసుకొని ఉపాధి పొందుతున్నారు. అంతకు రెట్టింపు రుణాలు ఇస్తామంటూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో హామీలిచ్చి, గెలిచాక చేతులెత్తేయడం సరికాదు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా యువతకు వందశాతం సబ్సిడీతో రుణాలిచ్చి, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ప్రభుత్వంపై తమలో వ్యతిరేకత మొదలైందని గమనించిన కాంగ్రెస్, తమ కుటుంబాల్లోని మహిళలకు కుట్టుమిషన్లు ఉచితంగా అందజేస్తామంటూ ప్రకటించడం విడ్డూరంగా ఉంది. అవేమీ మాకు వద్దు. స్వయం ఉపాధి పథకాలు వర్తింపజేయాలి.
– మీర్జా అస్మత్ అలీ బేగ్, మైనార్టీ యువజన నాయకుడు