Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 28 : పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన, గర్భిణులకు సీమంతాల మధ్య అంగన్వాడీ కేంద్రాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను గోదావరిఖనిలో మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. గోదావరిఖని అడ్డగుంటపల్లిలో గల ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఈసీసీఈ వార్షికోత్సవ వేడుకలకు రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి ముఖ్యతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అక్షరభ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి ప్రగతి పత్రాలను అందజేశారు. గర్భిణులకు సీమంతాలు చేసి పౌష్టికాహారం అందజేశారు.
మేయర్ మాట్లాడుతూ ఐదేళ్ల లోపు చిన్నారులకు సృజనాత్మకతతో కూడిన విద్య అందించడానికి అంగన్వాడీ కేంద్రాలు దోహద పడుతాయన్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అంగన్వాడీ సెంటర్లలో చేర్పించాలన్నారు. గర్భిణీ స్త్రీలు పోషక విలువలతో కూడిన ఆహారంను తీసుకోవాలన్నారు. అంగన్వాడీ సెంటర్ల నుంచి ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడమే గ్రాడ్యుయేషన్ డే ప్రాముఖ్యత అని వివరించారు. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లల గ్రేడ్లు ప్రకటించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గట్ల రమేష్, సీడీపీఓ అలేఖ్య పటేల్, పర్యవేక్షకులు మమత, షరీస్, ఎన్జీవో లిటిల్, అంగన్వాడీ టీచర్లు రజిత, మత, శారద, శైలజ, రమతోపాటు పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.