కలెక్టరేట్, ఏప్రిల్ 15 : ఉపాధిహామీ పథకం ఎత్తివేతకు కేంద్రం మరో కుట్రకు తెరతీసింది. ఓ వైపు కూలి పెంచినట్టుగా చెబుతూనే, మరోవైపు చెల్లింపుల ఆధారంగానే కాంపోనెంట్ నిధులు విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఎంత పనిచేస్తే అంతే చెల్లింపులు చేసేలా, క్రమం తప్పకుండా ఉపాధిహామీ పనికి వచ్చే వారికే చెల్లింపులు చేసేలా నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసి, కూలీల మెడపై కత్తి పెట్టింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో ఇప్పటికే జిల్లాలో వేలాది మంది కూలీలు ఉపాధి పనులకు దూరం కాగా, తాజాగా అమలు చేయనున్న నిర్ణయంతో ఉపాధి కూలీల సంఖ్య జిల్లాలో మరింత తగ్గనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో నిర్దేశించిన మేరకు కూలీలు పనులు చేసుకుని వెళ్ళేవారు. మిగతా సమయంలో ఇతర పనులు చేసుకుంటూ, అంతో ఇంతో సంపాదించుకునేవారు. అయితే, ప్రస్తుత నిబంధనలతో అధికారులు, ఉపాధి మేట్లు చెప్పిన సమయంలో మాత్రమే పనులు చేయాల్సి ఉంటుంది. దీంతో, పొద్దంతా ఉపాధి పనికే సమయమివ్వాల్సి ఉంటుంది. కేవలం రూ.28 మాత్రమే పెంచి, రోజంతా పని స్థలంలో ఉండేలా ఆదేశాలు జారీ చేయడం వెనుక ఆంతర్యమేంటనే ప్రశ్న కూలీల నోటి నుంచి వస్తోంది. అలవికాని నిబంధనలు అమలు చేస్తూ కూలీలను పనికి దూరం చేసి, ఈ పథకానికి మంగళం పాడవచ్చనే భావనతోనే కేంద్రం ఈ చర్యలకు పాల్పడుతోందనే విమర్శలు వస్తున్నాయి.
ఏడాదిలో ఎప్పుడైనా వంద రోజుల పని దినాలు కల్పించాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు విరుద్ధంగా కేవలం వేసవిలో మాత్రమే ఉపాధి పనులు చేసేలా, కూలీలపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే, ఎండ వేడి భరించలేక కూలీలు పనులకు రాలేకపోతున్నారు. ఈ కారణంగా వారికి భత్యం చెల్లింపులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 1,22,988 కుటుంబాలకు జాబ్ కార్డులుండగా, 58,825 కుటుంబాల్లోని కూలీలకు గత ఆర్థిక సంవత్సరంలో పనులు కల్పించారు. ఇందులో కేవలం 7 వేల కుటుంబాలు మాత్రమే వంద రోజులు పూర్తి చేసుకోగా, మిగతా వారికి నామమాత్రంగానే పనులు కల్పించినట్లు అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం రాబోయే రోజుల్లో ఉపాధి కూలీలకు పని కల్పన ఇక గగనమే అని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.