మొదటి రోజు సార్వత్రిక సమ్మె సక్సెస్
కదిలిన కార్మిక, కర్షక సంఘాలు
అన్ని మండలాల్లో ర్యాలీలు, ఆందోళనలు
బీజేపీ సర్కారును గద్దె దించడమే లక్ష్యం
మోదీకి ప్రధానిగా కొనసాగే అర్హత లేదు
నినదించిన నాయకులు, కార్మికులు
నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు
కార్యాలయాల ఎదుట నిరసనలు
కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కార్మికలోకం భగ్గుమంది. దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె మొదటి రోజైన సోమవారం ఉమ్మడి జిల్లాలో సక్సెస్ అయింది. కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ, బ్యాంకు ఉద్యోగ సంఘాలు ర్యాలీలు, రాస్తారోకోలతో హోరెత్తించాయి. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు మద్దతుగా నిరసన తెలిపాయి. ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, ముఖ్యమైన గ్రామాల్లోనూ కార్మికులు కదం తొక్కారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ పలు చోట్ల రాస్తారోకోలు చేపట్టారు. ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్న ప్రధాని మోదీని గద్దె దించడమే తమ లక్ష్యమని నినదించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
కరీంనగర్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ స్థాయిలో ఇచ్చిన సార్వత్రిక సమ్మెలో కార్మిక, కర్షకలోకం కదం తొక్కింది. ఉమ్మడి జిల్లాలోని పలు కార్యాలయాల్లో ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. సమ్మె ప్రభావం మొదటి రోజు ఉమ్మడి జిల్లాలో స్పష్టంగా కనిపించింది. వివిధ మాల్స్లో పని చేస్తున్న కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో షాపింగ్ మాల్స్ మూసి ఉన్నాయి. ఆటో కార్మికులు పాల్గొనడంతో మధ్యాహ్నం వరకు ఆటోల రాకపోకలు కనిపించలేదు. ఆటో మొబైల్ కార్మికులు సైతం సమ్మెలో పాల్గొనడంతో ఈ రంగం స్తంభించి పోయింది. మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు సైతం విధులకు హాజరు కాలేదు. బ్యాంకులు, ఎల్ఐసీ కార్యకలాపాలు స్తంభించాయి. బ్యాంకుల ముందు ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహించిన ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. దీంతో మొదటి రోజు బ్యాంక్ లావాదేవీలు పూర్తిగా నిలిచి పోయాయి.
భవన నిర్మాణ పనులు, ఉపాధి హామీ పనులు నడవ లేదు. రెండో రోజైన మంగళవారం సైతం సమ్మె కొనసాగనున్నది. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, న్యూడెమొక్రసీ, ఐఎఫ్టీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, హమాలీ యూనియన్, పవర్లూం కార్మిక సంఘం, ఆటో, ట్రాన్స్ఫోర్ట్ యూనియన్, మున్సిపల్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, ఆశా, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, ఎఐసీ, బీఎస్ఎన్ఎల్, మెడికల్ రిప్స్, పోస్టల్ వర్కర్స్ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, వర్కింగ్ జర్నలిస్టు యూనియన్, ఉపాధి హామీ కూలీలు, తదితర యూనియన్ల ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించారు. స్థానిక తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. బీజేపీ ప్రభుత్వాన్ని తప్పించి దేశాన్ని రక్షించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లిల్లోనూ కార్మికులు, కర్షకులు భారీ ర్యాలీలు నిర్వహించారు. కొత్తపల్లి, చొప్పదండి, మాకొండూర్లో రాస్తారోకోలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు వామపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వివిధ బ్యాంకుల ముందు ఉద్యోగులు నిరసనలు తెలిపారు. టీఎన్జీఓల ఆధ్వర్యంలో నల్ల బాడ్జీలు ధరించి ఉద్యోగులు విధులకు హాజరైనారు. విద్యుత్తు ఉద్యోగులు కూడా నల్ల బాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. మంగళవారం అల్గునూర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున రహదారుల దిగ్భందం చేసేందుకు కార్మిక సంఘాల నాయకులు సమాయత్తమవుతున్నారు.