సిరిసిల్ల జిల్లాలో కారు జోరుమీదున్నది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా టాప్గేర్లో దూసుకెళ్తున్నది. ఓవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వద సభలు.. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్షోలతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుత్తున్నది. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధి, ప్రతిపక్షాలకు అవకాశమిస్తే జరిగే నష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్, అమాత్యుడు రామన్న ప్రసంగాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింప జేస్తుండగా, అంతటా మద్దతు పెరుగుతున్నది. అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని పిలుపుతో సిరిసిల్ల, వేములవాడ అభ్యర్థులు కేటీఆర్, చల్మెడ లక్ష్మీనరసింహారావుకు ప్రజానీకం జైకొడుతుండగా, గులాబీ శ్రేణుల్లో గెలుపుధీమా కనిపిస్తున్నది.
-సిరిసిల్ల/ వేములవాడ, నవంబర్ 27
సిరిసిల్ల/వేములవాడ, నవంబర్ 27: సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. ప్రచారంలో ఎవరికీ అందనంతగా ముందంజలో ఉన్నది. గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 17న సిరిసిల్ల, ఈనెల 26న వేములవాడ ప్రజా ఆశీర్వా సభలు నిర్వహించారు. ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గంతోపాటు వేములవాడ అభ్యర్థి చల్మెడకు మద్దతుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కథలాపూర్, మేడిపల్లి, బీమారం, చందుర్తి ప్రజా ఆశీర్వాద సభలు, కోనరావుపేట, రుద్రంగి వేములవాడ, తంగళ్లపల్లి రోడ్ షోలు నిర్వహించారు. తంగళ్లపల్లి, ముస్తాబాద్, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలోనూ రోడ్షోలు నిర్వహించారు. నాటి కాంగ్రెస్ పాలనలో మెట్టప్రాంతంలో అనుభవించిన కష్టాలు, సాగు, తాగునీటి గోసలు, స్వరాష్ట్రంలో సాధించిన విజయాలను కండ్ల ముం దుంచారు.
అభివృద్ధిని వివరిస్తూ, ప్రత్యర్థులపై పంచ్లు, సెటైర్లు వేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. నాడు నీళ్ల కోసం కోట్లాడిన మండలవాసులకు సిరిసిల్ల-తంగళ్లపల్లి వంతెన కింద శాశ్వతంగా నీరు ఉందని వివరించారు. నాడు ఎట్లుండే.. నేడు ఎట్లయిందంటూ.. జరిగిన అభివృద్ధిని ప్రజలతోనే చెప్పించారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేకిగా మారిందని, పూటకో మాటతో పరేషాన్ చేస్తున్నదని మండిపడ్డారు. మరో పార్టీ మతంపేరుతో మోసం చేయాలని చూస్తున్నారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను మదిలో పెట్టుకొని ఆ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
మోదీ ప్రతి ఖాతాలో డబ్బులు వేస్తానని మరిచిపోయాడని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గానికి ఏం చేశాడని ప్రశ్నించారు. రెచ్చగొట్టడమే ధ్యేయంగా మాట్లాడుతున్నాడని, యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంకోవైపు వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజలతో మమేకమవుతూ.. తాను గెలిస్తే చేసే పనులకు సంబంధించిన ప్రణాళికను వివరిస్తున్నారు. తాను ఆశతో కాదని, ఆశయంతో వచ్చాననీ, ఎములాడ రాజన్న దయతో మీ ముం దుకొచ్చానని, తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 26న నిర్వహించిన సభలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ చల్మెడపై ప్రశంసల జల్లు కురిపించారు. చల్మెడ గెలిస్తే వేమలవాడను అన్ని రకాలు తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో బీర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. ఇదివరకే గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అలాగే మంత్రి కేటీఆర్ సైతం రోడ్షోల ద్వారా తొమ్మిదిన్నర ఏండ్లలో రాష్ట్రంలో జరిగిన ఆదర్శమైన అభివృద్ధిని వివరిస్తూనే, ప్రతిపక్షాలు వస్తే ఏమవుతుందో అవగతం చేస్తున్నారు. సుస్పష్టంగా కేసీఆర్ పాలనను ప్రజల మదిలో నింపుతున్నారు. రోడ్షోలలో అన్ని గ్రామాల పేరును సంబోధించడం ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. ఈ నెల 15న తంగళ్లపల్లి, 20న ముస్తాబాద్, 26న వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో నిర్వహించిన కేటీఆర్ రోడ్షోలు నిర్వహించగా, రామన్న ప్రసగం ప్రజలను ఆకట్టుకున్నది.
అలాగే ఈ నెల 28న సిరిసిల్ల పట్టణంలో నిర్వహించే రోడ్షోకు అమాత్యుడు హాజరుకానున్నారు. ఈ రోడ్షోలకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో ప్రతిపక్షాల ఆశలు గల్లంతవుతున్నాయి. ప్రచారంలో భాగంగా స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూనే.. పరిష్కరిస్తామనే హామీని ఇస్తూ ప్రజల్లో భరోసా నింపుతున్నారు. ప్రతి రోడ్షోల్లో ప్రజలు మంత్రి కేటీఆర్కు నీరాజనం పలుకుతున్నారు. పెద్ద ఎత్తున తరలిరావడంతో భవంతులు సైతం ఎక్కిమరీ రామన్న ప్రసంగాన్ని వింటున్నారు. రోడ్షోలు ముగిసిన తర్వాత ప్రజల్లో అభివృద్ధిపై చర్చ జరుగుతున్నది. గింతకంటే ఇంకేమీ చేస్తారని, మనసున్న రామన్నను వదులుకోమంటూ వెల్లడిస్తామన్నారు.
సిరిసిల్ల ఎడ్యుకేషన్ హబ్గా మారిందని మం త్రి కేటీఆర్ తెలిపారు. తంగల్లపల్లి మండలం జిల్లెల్లలో వ్యవసాయ కళాశాల, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. త్వరలో తంగళ్లపల్లి వరకు రైలు వస్తుందని హామీఇచ్చారు. ఈ ప్రాంత యువకులతో కోసం అప్పారెల్ పా ర్కును ఏర్పాటు చేసి, దాదాపు ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. చీర్లవంచలో దాదాపు మూడు వందల ఎకరాల్లో దేశంలో ఎక్కడా లేనివిధంగా అక్వాహబ్ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. తంగళ్లపల్లి మండలంలో చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందే ఉందని.. మరోసారి ఆశీర్వదించాలని కోరారు. స్థానిక సమస్యలను పరిష్కారిస్తామని హామీఇచ్చారు.
ముస్తాబాద్లో వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తన రోడ్షోలో ప్రకటించారు. ఇప్పటికే ముస్తాబాద్లో 30పడకల దవాఖాన మంజూరు చేయగా, నిర్మాణంలో ఉందని తెలిపారు. ముస్తాబాద్ మండలంలోని చెరువులన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయని.. బడులు బాగు చేసుకున్నామని, పెద్దబడి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుందని చెప్పారు..మల్లన్న సాగర్ జలాలను కాలువల ద్వారా బంధనకల్కు తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఎగువమానేరు ప్రాజెక్టు మండుటెండల్లోనూ మత్తడి దుంకుతున్నదని, రైతులకు పుట్లకొద్దీ వడ్లు పండుతున్నాయని వివరించారు.
వీర్నపల్లిలో మండలంలోని పోడు భూముల సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి కేటీఆర్ రోడ్షోలో ప్రకటించారు. ప్రతీ గ్రామానికి సేవాలాల్ మహారాజ్ భవనాన్ని, మండల కేంద్రంలో బంజారా భవనాన్ని మంజూరు చేస్తామని తెలుపడంతో తండావాసుల్లో ఆనందంనింపింది. ప్రతి గ్రామానికి కార్పొరేట్ స్థాయిలో బడులను నిర్మిస్తామని ప్రకటించారు. వీటితోపాటు లావాణీ పట్టాల భూములపై భూపట్టాలను అందిస్తామని తెలుపడంతో సంతోషించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు.
ఎల్లారెడ్డిపేటను కోనసీమగా మారుస్తానని మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో ఈ ప్రాంత రైతు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండల కేం ద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని, ఇం దు కోసం రూ.40లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. వృత్తి విద్య నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పా టు చేస్తామని, మల్కపేట రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా సింగసముద్రం చెరువును నిం పుతామని తెలిపారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘ భవనాలను నిర్మిస్తామని ప్రకటించారు
గంభీరావుపేట మండలం నర్మాలలో ఎగుమానేరు జలాశయంలో పూడికతీసి, రెండు టీఎంసీలు నిండేలా చూస్తామని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. కేజీ టూ పీజీ విద్యార్థులకు హాస్టల్ భవన నిర్మాణం చేపడుతామని ప్రకటించారు. అలాగే గంభీరావుపేటలో సబ్ ట్రెజరీ నిర్మాణం, సింగసముద్రం నుంచి లిప్ట్ ఇరిగేషన్ ద్వారా సముద్రాలింగాపూర్, గజసింగవరం, గోరంట్యాలకు నీరు అందిస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ నేతలకు వ్యవసాయం మీద అవగాహన లేక అజ్ఞానం మాటలు మాట్లాడుతున్నారని, 10హెచ్పీ మోటర్లతో, మూడు గంటల కరెం టు ఇస్తామంటూ ప్రకటించడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. మూ డు గంటల్లో 10హెచ్పీ మోటర్లతో ఎంత పొలంపారుతుందో మీరే చెప్పాలన్నారు. పలు రోడ్షోలో ఎంత మంది రైతులు 10హెచ్పీ మోటర్లు వాడుతున్నారని మంత్రి కేటీఆర్ అడుగగా, ఎవ రూ లేరని సమాధానమిచ్చారు. కాంగ్రెస్ నేత ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు వద్దని, భట్టివిక్రమార్క ధరణి పోర్టల్ను తొలగించి పట్వారీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పాలనే దరిద్రమని మండిపడ్డారు. 11సార్లు వాళ్లకు చాన్స్ ఇచ్చిన ఏం చేయనోళు? ఇప్పుడొచ్చి ఏం చేస్తరు?
జనవరిలో కొత్త రేషన్కార్డులు, కొత్త పింఛన్లు అందిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అత్తలకు ఆసరా పింఛన్లు ఇస్తుండగా, కొడండ్లు కోపంగా ఉన్నారని.. వారికి కూడా అధికారంలోకి రాగానే సౌభాగ్యలక్ష్మి ద్వారా నెలకు రూ.3వేలు అందిస్తామని ప్రకటించారు. ఆసరా పింఛన్ను దశలవారీగా రూ.5వేలు పెంచుతామని వెల్లడించారు. రైతుబంధు రూ.10వేల నుంచి రూ.16వేలకు పెంచుతామని చెప్పారు. రూ.400కే సిలిండర్ అందిస్తామని ప్రకటించారు. తెలుపు రేషన్కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ, రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని, గల్ఫ్లో నివసించే వారికి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని అమాత్యుడు రామన్న ప్రకటించారు.
మంత్రి కేటీఆర్ నియోజవర్గంలో నిర్వహించిన రోడ్షోలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. ఇప్పటికే బూత్ల వారీగా ప్రచారం నిర్వహిస్తున్న కార్యకర్తలు, నాయకులకు రోడ్షోలతో మంత్రి కేటీఆర్ బూస్ట్నిచ్చారు. ఎక్కడికి వెళ్లిన మంత్రి కేటీఆర్కే మా మద్దతు అంటున్నారని అన్నివర్గాల ప్రజలు చెబుతున్నారు. అఖండ మెజార్టీతో మంత్రి కేటీఆర్ విజయం సాధించడం తధ్యమని పేర్కొంటున్నారు.
నాకు జన్మనిచ్చింది నా తల్లి.. రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల ప్రజలు.. అంటూ పలు సభల్లో మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. మీరు ఇచ్చిన ఈ అవకాశంతో నాకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించిందని వెల్లడిస్తున్నారు. మీ దయతో ఎమ్మెల్యేగా, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రిని అయ్యానని పేర్కొన్నారు. మీకు సేవ చేస్తున్నా. ఇంకా ఎంతో చేయాలని ఉందంటూ వివరించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నాకు సిరిసిల్ల ఎమ్మెల్యేగానే మీరు ఇచ్చిన గుర్తింపు ఉందన్నారు. తొమిదిన్నర ఏండ్లలో మీరు గర్వపడేలా అభివృద్ధి చేశానని.. ఎక్కడా తలదించుకునేలా చేయలేదని.. బాధ్యతలు పెరగడం వల్ల రాష్ట్రమంతా ప్రచారం చేయాల్సి వస్తున్నదన్నారు. ప్రతి ఒక్కరినీ కలువాలని, ప్రతీ గ్రామానికి రావాలని ఉందన్నారు. ప్రతి ఇంటికీ వచ్చినట్లే భావించాలని, ఆగంకాకుండా.. కారు గుర్తుకే ఓటేసి మరోసారి గెలిపించాలని కోరారు.
– మంత్రి కేటీఆర్