గుండె సంబంధిత చికిత్సకు రూ.లక్ష ఎల్వోసీ మంజూరు
సిరిసిల్ల రూరల్, మే 17: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బచ్చపల్లి పెంటయ్య(52) భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. వారం క్రితం గుండె సంబంధిత వ్యాధితో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు సిరిసిల్ల దవాఖానకు తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యులు హైదరాబాద్కు రిఫర్ చేశారు. నిరుపేద కుటుంబం కావడంతో ఖరీదైన వైద్యం చేయించుకోలేకపోయే స్థితిలో ఉండడంతో ఆందోళన చెందారు. జిల్లెల్ల సర్పంచ్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు.
హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకురావాలని సూచించారు. నిమ్స్లో గుండె ఆపరేషన్ చేసి, స్టంట్స్ వేశారు. సుమారు రూ.2.50 లక్షల వరకు వైద్యానికి ఖర్చు కాగా, మొదటి విడుతగా రూ.లక్ష ఎల్వోసీ మంజూరు చేశారు. ఈ ఎల్వోసీ నిమ్స్లో మంగళవారం కుటుంబ సభ్యులకు జిల్లెల్ల సర్పంచ్ మాట్ల మధు అందజేశారు. మరో లక్ష ఎల్వోసీ కూడా అందిస్తామని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చినట్లు మధు తెలిపారు. మరో రెండు రోజుల్లో పెంటయ్యను డిశ్చార్జి చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు, బచ్చపల్లి పెంటయ్య, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.