కలెక్టరేట్/సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 28: ‘రాష్ట్రంలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. ఇది పేదల ప్రభుత్వం. వారి ముఖాల్లో చిరునవ్వు చూసే ప్రభుత్వం’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సిరిసిల్ల పట్టణానికి సంబంధించి డబుల్ బెడ్రూం ఇండ్లు పొందిన 400 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నాడు ఎన్టీఆర్ తర్వాత సీఎం కేసీఆర్ పేదలకు ఇండ్లు కట్టించే పథకం చేపట్టారన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కింద పారదర్శకంగా అందిస్తున్నామన్నారు.
ఎన్టీఆర్ సీఎంగా ఉన్న హయాంలో బలహీనవర్గాలకు గృహనిర్మాణ పథకం అమలు చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉండగా 40 లక్షల ఇండ్లు మంజూరైనట్లు లెక్కలు చెబుతున్నాయని, క్షేత్రస్థాయిలో లెక్కల్లో తేడా ఉన్నట్లు గుర్తించి అర్హులైన వారికి మాత్రమే గృహాలు అందేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగామన్నారు. సిరిసిల్ల పట్టణం లో 2788 ఇండ్లు లేని వారు ఉన్నట్లు అధికారులు రిపోర్ట్ ఇచ్చారని, వీరి కోసం తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో 1260 ఇండ్లు నిర్మించుకొని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకున్న విషయం తెలిసిందేనన్నారు. వీటితోపాటు పెద్దూరు, శాంతినగర్, రగుడు కలిపి మొత్తం 2052 ఇండ్లు నిర్మించామన్నారు. వీటిలో రెండు విడుతలుగా మండెపల్లి కేసీఆర్నగర్లో 800 ఇండ్ల పట్టాలను అందజేశామని, నేడు మూడో విడుతగా 400 మందికి అందజేయడంతో 1270 ఇండ్లు పూర్తయినట్లు పేర్కొన్నారు.
త్వరలోనే రగుడు, శాంతినగర్, పెద్దూరులోని డబుల్ బెడ్రూంలు అందించి, పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. సిరిసిల్లలో ఇండ్లు లేని పేద వారికి ఇల్లును మంజూరు చేస్తామని, వ్యక్తిగతంగా తానే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. పట్టాలు పొందిన మహిళలు రాని వారికి భరోసానివ్వాలని, తమలాగే మీకు కూడా వస్తుందని చెప్పాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు న్యాయం చేయడానికే ప్రభుత్వం ఉందని, రాని వారందరికీ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. సొంత జాగ ఉన్న వారికి రూ.3 లక్షల పథకం ద్వారా, జాగ లేని వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని కలెక్టర్ కు జాబితాను అందించాలని, వారికి కూడా అందిస్తామన్నారు. పార్టీలకతీతంగా పారదర్శకంగా డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తున్నామని వెల్లడించారు. 30 ఏండ్ల క్రితం 3వేల మందికి కార్మిక క్షేత్రంలో ఇచ్చిన ఇండ్ల పట్టాలకు త్వరలోనే న్యా యం చేస్తామన్నారు.
క్రయ విక్రయాలతోపాటు ట్రాన్స్ఫరేబుల్ పట్టాలుగా మారుస్తామని భరోసానిచ్చారు. ఇక్కడ కలెక్టర్ అనురాగ్ జయంతి, న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ము న్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, అదనపు కలెక్టర్లు బీ సత్యప్రసా ద్, ఎన్ ఖీమ్యానాయక్, సెస్ చైర్మన్ చిక్కాల రా మారావు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్స య్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఉన్నారు.