ఇథనాల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కృషి
మంత్రి కేటీఆర్ అభినందన
జగిత్యాల, జూన్ (నమస్తే తెలంగాణ) : ‘డాక్టర్ సంజయ్.. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అంకుల్ కంటే ఎక్కువగా నా వెంటపడి, ఇథనాల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మెట్ల చిట్టాపూర్కు తెచ్చేలా చేశారు’ అంటూ రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సభా వేదికగా ప్రకటించారు. మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ గ్రామంతో పాటు, హసకొత్తూరు, చౌట్పల్లి గ్రామాల పరిధిలో 1040 కోట్లతో ఇథనాల్ తయారీ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భువి బయో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్తో.. 160 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ధాత్రి బయో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో శుక్రవారం మెట్పల్లిలో ఎంవోయూ కుదుర్చుకున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ కృష్ణభాస్కర్ దాత్రి, భువి కంపెనీల ప్రతినిధులు శ్యామలరావు, నాగవర్ధన్రావు మెట్పల్లి ప్రజల సమక్షంలో ఎంవోయూలు మార్చుకున్నారు. అదే విధంగా కోరుట్లలో జరిగిన కోచింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కోరుట్లలో వీవీ 5 సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, వరిగడ్డి నుంచి ఇథనాల్ను తయారు చేసే పరిశ్రమను మెట్పల్లి సమీపంలోని మెట్లచిట్టాపూర్లో ప్రారంభిస్తున్నామన్నారు. మెట్పల్లి ప్రాంతంలో ఇథనాల్కు అవసరమైన ముడిపదార్థంతో పాటు చదువుకున్న యువత సైతం అందుబాటులో ఉందన్నారు.
సామర్థ్యం ఉన్న వారందరికీ ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇథనాల్ తయారీ కేంద్రంలో దాదాపు 2వేల మంది యువతీయువకులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో 300 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. 1040 కోట్ల విలువైన ఇథనాల్ పరిశ్రమ, 160 కోట్ల విలువైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పంజాబ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో ప్రారంభించాలని భువి, ధాత్రి బయో సొల్యూషన్స్పై ఒత్తిడి వచ్చిందని, అయితే సీఎం కేసీఆర్ దక్షతకు ముగ్ధులైన ఆ కంపెనీలు తెలంగాణలో పరిశ్రమలను స్థాపించేందుకు నిర్ణయించాయన్నారు. వరిగడ్డి నుంచి ఇథనాల్ తయారు చేస్తారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఆయన తనయుడు ప్రముఖ వైద్యుడు డాక్టర్ సంజయ్ మెట్పల్లి ప్రాంతంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఇక్కడ ఏర్పాటు చేయించాలని, మెట్పల్లి యువకులకు ఉపాధి లభిస్తుందని తనకు విన్నవించారన్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అంశాన్ని మొదటి నుంచీ డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఫాలో అప్ చేసి, మెట్పల్లికి మంజూరయ్యేలా చేశారన్నారు. అలాగే వీఫై అనే డాటా బేస్డ్ కమ్యునికేషన్ సంస్థ 200 సీట్ల కెపాసిటితో ఒక కాల్ సెంటర్ను మినీ పట్టణాల్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. వీఫై సంస్థ ప్రతినిధులతో సైతం చర్చించి, కోరుట్ల పట్టణంలో 200 మందితో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని డాక్టర్ సంజయ్ సూచించాడన్నారు. ఆయన అభ్యర్థన నేపథ్యంలో భువి, ధాత్రి, వీఫై సంస్థల ప్రతినిధులతో చర్చించగా, వారు క్షేత్రస్థాయి పర్యటన జరిపి, మెట్లచిట్టాపూర్లో ఇథనాల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, కోరుట్లలో వీఫై కాల్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని ప్రకటించారన్నారు. వారి అంగీకారం తర్వాత 90 ఎకరాల స్థలంలో ఫుడ్ ప్రాసెసింగ్, ఇథనాల్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనుమతిని మంజూరు చేశామన్నారు. అలాగే వీఫై కాల్ సెంటర్ కోసం కోరుట్ల పట్టణంలో భవననాన్ని అన్వేషిస్తున్నామని, భవనం ఫైనలైజ్ అయిన తర్వాత ప్రారంభిస్తామన్నారు. కోరుట్లలో నిపుణులైన యువత లభ్యమైతే, వీఫై డాటా ఎంట్రీ సంస్థను సైతం మొదలు పెట్టేందుకు సంస్థ సిద్ధంగా ఉందన్నారు. మెట్పల్లి, కోరుట్ల పరిధిలోని యువతకు ఉపాధి, ఉద్యోగాల కోసం పట్టుబట్టి సాధించిన డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అభినందనీయులన్నారు.