కోరుట్ల కేంద్రంగా నకిలీ పాస్పోర్టుల రాకెట్ సంచలనం సృష్టిస్తున్నది. కౌంటర్ ఇంటెలిజెన్స్, సీఐడీ అధికారులు సంయుక్తంగా చేసిన దాడులతో డొంకంతా కదులుతున్నది. శుక్రవారం కోరుట్ల, హైదరాబాద్, మరో రెండు పట్టణాల్లోని అనుమానితుల ఇండ్లల్లో సోదాలు చేసి, భారీగా నకిలీ పాస్పోర్టులు, తయారీకి ఉపయోగించే నకిలీ ధ్రువీకరణ పత్రాలు, హార్డ్ డిస్క్లు, పెన్డ్రైవ్లు స్వాధీనం చేసుకోవడంతోపాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
అయితే, ఈ వ్యవహారంలో అన్నికోణాల్లోనూ విచారిస్తూ.. పోలీస్ శాఖ పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. తయారీదారులకు అన్ని రకాలుగా సహకరిస్తున్నట్టు గుర్తించి జగిత్యాలకు చెందిన ఓ పోలీస్ అధికారితోపాటు హైదరాబాద్కు చెందిన మరో పోలీస్ అధికారిని సైతం అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా, శనివారం 12 మంది సభ్యుల ముఠాను సీఐడీ అధికారులు అరెస్ట్ చూపడం సంచలనం సృష్టించింది.
జగిత్యాల, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : కొద్దిరోజుల క్రితం శ్రీలంకలో ఓ ఇద్దరు వ్యక్తులు నకిలీ పాస్ట్పోర్టులతో పట్టుబడ్డారు. ఆ సమయంలో పాస్పోర్టులను పరిశీలించిన అధికారులు, అవి నకిలీవని, జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతంలో తయారైనట్టు గుర్తించారు. ఆ మేరకు ఉన్నతాధికారులతోపాటు భారత రాయబార సంస్థలకు సమాచారం అందించారు. అలాగే, బంగ్లాదేశ్కు చెందిన వారు సైతం నకిలీ పాస్పోర్టులపై పట్టబడ్డారు. అవి కూడా కోరుట్ల ప్రాంతం చిరునామాలతోనే ఉండడంతో మన రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్, ఆర్థిక నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు రంగంలోకి దిగారు.
కోరుట్ల ప్రాంతంలో నకిలీ పాస్పోర్టులు తయారు చేస్తున్నారనే అనుమానంతో శుక్రవారం సంయుక్తంగా దాడులు చేశారు. నలుగురి ఇళ్లల్లో సోదాలు చేసి, పెద్ద మొత్తంలో నకిలీ పాస్పోర్టులు, తయారీకి అవసరమయ్యే ఆధార్, ఓటరు, రేషన్కార్డులు, పదో తరగతి మెమోలు, వయసు ధ్రువీకరణ పత్రాలు (నకిలీవి), కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, పెన్డ్రైవ్లు స్వాధీనం చేసుకోవడంతోపాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
అదే రోజు రాష్ట్రంలోని మరో రెండు పట్టణాలు, హైదరాబాద్లోని కొన్ని ఏరియాల పరిధిలో తనిఖీలు చేసి, మొత్తంగా 108 నకిలీ పాస్పోర్టులు, తయారీకి సిద్ధంగా ఉంచిన ధ్రువీకరణ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కాగా, ఈ వ్యవహారంలో నకిలీ పాస్పోర్టుల తయారీదారులతోపాటు అందుకు సహకరించిన పోలీస్ అధికారులను సైతం గుర్తించే పనిలో కౌంటర్ ఇంటెలిజెన్స్, సీఐడీ అధికారులు తలమునకలయ్యారు. పదేళ్ల నుంచి కోరుట్ల కేంద్రంగా దందా సాగుతుండడం, ఇప్పటికే కేసులు సైతం నమోదైన నేపథ్యంలో లోతుగా అన్వేషిస్తున్నారు.
గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించి, తర్వాత ఉద్యోగోన్నతిపై ప్రస్తుతం జగిత్యాలలో పనిచేస్తున్న ఓపోలీస్ అధికారి, ఈ నకిలీ పాస్పోర్టుల తయారీదారులకు అన్ని రకాలుగా సహకరించినట్టు నిర్ధారించుకొని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అలాగే, హైదరాబాద్లోని ఒక ఏరియాలో పనిచేసే పోలీస్ అధికారి సైతం పాస్పోర్టుల తయారీకి సహకరించినట్టు గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కాగా, శనివారం 12 మంది సభ్యుల ముఠాను సీఐడీ అధికారులు అరెస్ట్ చూపారు. వందల మంది విదేశీయులకు పాస్పోర్టులు అందించారని చెప్పారు.
బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలవాసులకు పాస్పోర్టులు తయారు చేసి ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణించిన కౌంటర్ ఇంటెలిజెన్స్, సీఐడీ అధికారులు, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విదేశీయులకు పాస్పోర్టు తీసేందుకు ఇక్కడి చిరునామాలు సృష్టించడంతోపాటు రెవెన్యూ, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లను సైతం తయారు చేసినట్టు గుర్తించారు.
అలాగే స్థానికుల ఆధార్, ఓటరు కార్డులను విదేశీయులు, స్థానికేతరుల పేర్లతో డూప్లికేట్ చేసినట్టు నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో రెవెన్యూశాఖకు సంబంధించిన కొన్ని ముద్రలు, పత్రాలు, విద్యాశాఖ ధ్రువీకరణ పత్రాలు, నకిలీ మెమోలు లభ్యం కావడంతో రెవెన్యూ, విద్యాశాఖల అధికారులు, సిబ్బంది సహకారం ఉన్నదా..? అనే కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం. కాగా, నకిలీ పాస్పోర్టుల తయారీదారుల్లో ఒకరు విద్యాశాఖలో ఉద్యోగి కావడంతో లోతుగా విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.
సీఐడీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మనుషులను దేశాలు దాటించేందుకు నకిలీ పాస్పోర్టులు తయారు చేసినప్పటికీ, దాని వెనుకాల ఉన్న కారణాలను లోతుగా అన్వేషిస్తున్నారు. విదేశీయులకు ఇక్కడ ఎలా పాస్పోర్టులు సృష్టించారు? ఎందుకు సృష్టించారు? వారికి ఉపాధి కల్పించే లక్ష్యమా..? లేకపోతే మరేదైనా కారణం ఉన్నదా..? అని విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
కోరుట్ల, హైదరాబాద్ లాంటి అతి సున్నితమైన ప్రాంతాల్లో నకిలీ పాస్పోర్టులు బయటపడడంతో తీవ్రవాద సంస్థలకు సైతం వీరు సహకరించారా..? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దాదాపు 20 ఏండ్లుగా నిషేధిత తీవ్రవాద సంస్థలకు సంబంధించిన ఆనవాళ్లు కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిలీ పాస్పోర్టుల తయారీపై పూర్తి స్థాయి పరిశీలన చేస్తున్నట్టు సమాచారం.
నకిలీ పాస్పోర్టులు తయారు చేయించి, డీ గ్యాంగ్ వాళ్లకు సపోర్టుగా స్మగ్లింగ్ ఏమైనా జరుగుతున్నదా..? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్కు సంబంధించి బంగారం, ఇతర మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కొన్నేండ్లుగా జరుగుతున్నదనే అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో బంగారం, మాదకద్రవ్యాలు సైప్లె చేస్తూ కొందరు పట్టుబడిన దాఖలాలు ఉన్నాయి.
కాగా, కోరుట్ల కేంద్రంగా నకిలీ పాస్పోర్టుల తయారీ బయటకు వచ్చిన నేపథ్యంలో దావూద్ గ్యాంగ్కు సంబంధించిన వ్యక్తులు ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి ఇక్కడ నకిలీ పాస్పోర్టులు సృష్టించుకొని స్మగ్లింగ్కు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.