మెట్పల్లి రూరల్, అక్టోబర్ 21: ప్రతిక్షణం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. శనివారం మెట్పల్లి మండలం చింతలపేట గ్రామంలోని మాల, మాదిగ, గోసంగి పెద్ద సంఘం, గోసంగి చిన్న సంఘం, ముదిరాజ్, గౌడ సంఘం, దూదేకుల సంఘాలు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఆ తీర్మాన పత్రాన్ని డాక్టర్ సంజయ్కు అందజేశాయి. తనకు మద్దతు పలుకుతున్న ఏడు కుల సంఘాల పెద్దలకు సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్టు వంటి ప్రజా సంక్షేమ పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కు ఓటేసి ఆశీర్వదిస్తే రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ, తెల్ల రేషన్ కార్డుదారులకు 5 లక్షల బీమా, ఆసరా పింఛను 5వేలకు పెంపు వంటి మరిన్నీ సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలప్పుడూ మాత్రమే వచ్చే ప్రతిపక్ష నాయకులు చెప్పే మాయమాటల వలలో ప్రజలు పడొద్దని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకల అర్చన, ఉపసర్పంచ్ గోపిడి ముత్యంరెడ్డి, ఎంపీపీ మారు సాయిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నల్ల తిరుపతిరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం రాజారెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు గడ్డం రాంరెడ్డి, నాయకులు మ్యాకల సుదర్శన్, బద్దం శ్రీనివాస్రెడ్డి, బోత్కూరి లింగారెడ్డి, ఆసరి స్వామి, కుల సంఘాల పెద్దలు మోతం రాజేందర్, పురాణం దుర్గేశ్, జేంజ గంగయ్య, ఎర్ర మారుతి, వేంపల్లి హన్మండ్లు, కుక్కదువ్వ హరీశ్, ఎండీ రజాక్, మహిళలు పాల్గొన్నారు.