Korukanti Chander | కోల్ సిటీ, జులై 24 : వర్ధిల్లు వెయ్యేళ్లు.. జీవించు నూరేళ్లు.. అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన సందర్భంగా గోదావరిఖని జవహర్ నగర్లోని శ్రీ జయ దుర్గా దేవి ఆలయంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేక పూజలు చేశారు. కేటీఆర్కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం ఆ పార్టీ నాయకుడు కోడి రామకృష్ణ ఆధ్వర్యంలో భక్తులకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కోరు కంటి చందర్ మాట్లాడుతూ అతడే ఒక చరిత్ర, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కొండంత అండ కేటీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండున్నర ఏండ్లుగా సాగుతున్న అరాచక పాలనకు ప్రజలు విసుగు చెందారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చిన బీఆర్ఎస్ని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా భక్తులు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.
విలువైన పండ్ల మొక్కలు పంపిణీ చేసినందుకు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి, మూల విజయ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య, కార్పొరేటర్లు తోకల శ్యామణి రమేష్, కర్క పద్మజ, నాయకులు నీరటి శ్రీనివాస్, మురళీధర్ రావు, మారుతి, కృష్ణవేణి, గుర్రం పద్మ, దొమ్మటి వాసు తోపాటు మాజీ కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.