ధర్మారం, నవంబర్ 19: ‘యాభై ఏండ్లు కాంగ్రెస్కు అధికారమిస్తే ప్రజలకు చేసిందేమీలేదు. సరిగ్గా కరెంటిచ్చిందిలేదు..పంటలకు నీరిచ్చిందిలేదు..కానీ ఇప్పుడు బూటకపు గ్యారెంటీలతో ప్రజల ముందుకు వచ్చి ఉద్ధరిస్తామంటున్నరు..వారిని నమ్మద్దు’ అంటూ కొప్పుల ఈశ్వర్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఆదివారం రాత్రి ధర్మారం మండలం రామయ్యపల్లి, చింతలపల్లి, రచ్చపల్లి, గురుపల్లి, పైడిచింతలపల్లి, కానంపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాదయాత్రకు మంత్రి ఈశ్వర్ హాజరై ఇంటింటా ప్రచారం చేశారు. కొప్పులకు మహిళలు బతుకమ్మలతో ఎదురెగి స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులు రాత్రింబవళ్లు పొలాల వద్ద పడిగాపులు పడేవారని గుర్తుచేశారు. ఎరువులు, యూరియా కోసం చెప్పులను లైన్లో పెట్టే దుస్థితి ఉండేదని చెప్పారు.
పేద వర్గాల మేలు కోసం ఏ ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదని మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన నాయకులు ఢిల్లీ నుంచి టూరిస్టుల్లా వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. తొమ్మిదిన్నరేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనను మాత్రమే నమ్మాలని ఆయన కోరారు. తమ ప్రభుత్వ పాలల్లో అన్ని వర్గాలకు మేలు జరిగిందని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా రైతాంగానికి అన్ని రకాల మేలు చేసిన ప్రభుత్వం తమదే నని అని ఆయన అన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో అన్ని వర్గాలకు మేలు చేస్తుందని తమను మాత్రమే ప్రజలు నమ్మాలని మంత్రి ఈశ్వర్ కోరారు.
ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డులను ఉన్న మహిళలందరికీ సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల రూ.3,000 గౌరవ భృతిని అందిస్తామని, సన్న బియ్యం అందిస్తామని,రూ. 400 కే సిలిండర్ గ్యాస్, రూ.5 ఐదు లక్షల బీమా కల్పిస్తామని, ఆరోగ్య రక్ష ద్వారా వైద్య సహాయం రూ. 15 లక్షల సహాయం అందిస్తామని, ఆసరా పింఛన్లు రూ.5,016, రైతుబంధు సహాయాన్ని రూ.16 వేలు సహాయం అందిస్తామని మంత్రి ఈశ్వర్ హామీ ఇచ్చారు. తమ మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మి కారు గుర్తుకు ఓటు వేసి తనను ఏడో సారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూసూరు పద్మజ, ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, సర్పంచులు రేగుల సదన్బాబు, మోర సుధాకర్, గుర్రం మనీషారెడ్డి, పైడి చింతలపల్లి ఇన్చార్జి సర్పంచ్ చొప్పరి స్వరూప కుమార్, రచ్చపల్లి ఎంపిటిసి బెల్లాల రోజా రాణి, ఆర్ బీఎస్ జిల్లా సభ్యుడు పూసూరు రామారావు, మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, అధికార ప్రతినిధి గుర్రం మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దొనికెని తిరుపతి, నాయకులు మార బాలయ్య, కత్తెర్ల రాజు, తాళ్లపల్లి రాజయ్య, బీసగోని తిరుపతి, బాలసాని శ్రీనివాస్, బెల్లాల లక్ష్మణ్ ప్రసాద్ ,మూల మల్లేశం మార సంధ్య, పాక వెంకటేశం, గుర్రం తిరుపతి గౌడ్, ఆవుల శ్రీనివాస్, నాగుల రాజేశం అయిత వెంకటస్వా మి, కొత్తమోహన్ మాజీ ఎంపీపీ పాత మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.