అత్యంత మహిమాన్విత హన్మాన్ ఆలయాల్లో ఒకటైన కొండగట్టు దేవస్థానం, దేశంలోనే గొప్పక్షేత్రంగా మారబోతున్నది. భక్తుల ఇలవేల్పుగా విలసిల్లుతున్న అంజన్న క్షేత్రం, సీఎం కేసీఆర్ సారథ్యంలో అద్భుత దివ్యధామంగా రూపుదిద్దుకోబోతున్నది. ఈ దిశగా ఇప్పటికే అడుగులు పడగా, తాజాగా ప్రభుత్వం ప్రత్యేక నిధి కింద వంద కోట్లు మంజూరు చేసింది. సరిగ్గా రెండు నెలల క్రితం జగిత్యాల పర్యటనలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. దీంతో భక్తులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కొండగట్టు దిగువన, కొడిమ్యాలలో సీఎం ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఇటు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలుపగా, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హైదరాబాద్లో సీఎంను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. నాడు కొండగట్టును ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు యాదాద్రి, వేములవాడ తరహాలో అభివృద్ధికి అడుగులు పడ్డాయని పేర్కొన్నారు.
– జగిత్యాల, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ)/చొప్పదండి
గత డిసెంబర్ 7న జగిత్యాలలో పర్యటించిన సీఎం కేసీఆర్, మోతె సభా వేదికగా కొండగట్టు గురించి ప్రస్తావించారు. దేశంలోనే గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామని, వంద కోట్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధికి పది కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు తాజాగా నిధులు మంజూరు చేసి ఇచ్చిన మాట నెరవేర్చారు.
చొప్పదండి నియోజకవర్గానికి పది కోట్లు
జగిత్యాల, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ)/మల్యాల/చొప్పదండి: అత్యంత మహిమాన్వితమైన హన్మాన్ ఆలయాల్లో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఒకటి. ఉత్తర తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా, కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్నది. మల్యాల మండలం ముత్యంపేటలో కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఈ దేవస్థానానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తుల తాకిడి ఉంటుంది. గతంలో వచ్చే వారి సంఖ్య వేలల్లోనే ఉన్నా.. క్రమంగా లక్షలకు చేరింది. అయినా నాటి సమైక్య పాలకులు ఏనాడూ కొండగట్టు అభివృద్ధిని పట్టించుకున్న పాపానా పోలేదు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆలయాలకు మహర్దశ పడుతున్నది. యాదగిరిగుట్టను అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ నర్సన్న దీవెనతో వేములవాడ, కొండగట్టు క్షేత్రాల అభివృద్ధికి కదిలారు. ఇప్పటికే వేములవాడలో పనులు నడుస్తుండగా, కొండగట్టులోనూ చేస్తున్నారు.
దేవస్థానానికి గతంలో 20 ఎకరాలు ఉండగా, పక్కన ఉన్న 384 ఎకరాలను కూడా అప్పగించారు. ఆలయంలో ప్రధానంగా ఉన్న నీటి కొరతను తీర్చారు. మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా 4.5 కోట్లతో ప్రత్యేక నీటి సంపును కొండగట్టు దిగువన ఏర్పాటు చేసి, కొండపైకి పంపింగ్ చేస్తున్నారు. 2.50 కోట్లు వెచ్చించి నూతన పుష్కరిణిని అందుబాటులోకి తెచ్చారు. 2.50 కోట్లతో మెట్లదారి సుందరీకరణ పనులకు దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి శంకుస్థాపన చేవారు. మెట్లను రీడిజైనింగ్ చేయాల్సి రావడంతో ప్రస్తుతానికి పనుల నిర్వహణ ప్రక్రియ టెండర్ దశలో ఉన్నది. ఆలయ పరిధిలోని వాహనాల పార్కింగ్ స్థలం పక్కన 2.50 కోట్లతో దీక్షావిరమణ మండపానికి సంబంధించిన పనులు నడుస్తున్నాయి. 4 కోట్లతో ఆలయ కార్యనిర్వహణాధికారి, కార్యాలయ పనులు కొనసాగించేందుకు నూతన భవనం నిర్మాణమై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. 90 లక్షలతో రామకోటి స్తూపం నిర్మాణమవుతున్నది. పనులు తుది దశలో ఉన్నాయి.
నెరవేరిన సీఎం హామీ.. వంద కోట్లు మంజూరు
గత డిసెంబర్ 7న జగిత్యాలకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మోతెలో జరిగిన భారీ బహిరంగ సభా వేదికగా కొండగట్టు, ధర్మపురి, వేములవాడ రాజన్న ఆలయాల గురించి ప్రస్తావించారు. వాటి అభివృద్ధి కోసం చేపట్టబోయే ప్రణాళికలను వివరించారు. కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని, దేశంలోనే గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. వంద కోట్లు ఇస్తామని హామీ ఇవ్వడంతోపాటు త్వరలోనే ఆగమ శాస్త్ర పండితులు, స్థపతులు ఆలయాన్ని పరిశీలించి, గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తారని చెప్పారు. సీఎం హామీ ఇచ్చిన రెండు నెలల్లోనే వంద కోట్లను మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేయడంపై చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ను హైదరాబాద్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
చేపట్టే పనులివే..
కొండగట్టు అభివృద్ధి పనులను చేయాలని కోరుతూ ఆలయ అధికారులు ఇప్పటికే నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం, రాతితో విమానగోపురాలు, రెండో ప్రాకారం, నాలుగు వైపులా రాజగోపురాలు, యాగశాల, నివేదనశాల నిర్మాణం, స్వామి వారి సన్నిధిలో రామాలయం, అభిషేక మండపం, సత్యనారాయణ స్వామి మండపం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శనాల క్యూలైన్ల పునర్నిర్మాణం, భక్తుల కోసం వంద గదుల ధర్మశాల, 50 వీఐపీ గదులు, డార్మెటరీ హాల్, నిత్యాన్నదాన సత్రం, లడ్డు, పులిహోర ప్రసాదాల తయారీ మండపాలను నిర్మించాలని అనుకున్నారు. ఆలయ పరిసరాల్లో సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, విద్యుద్దీపాల అలంకరణ చేయాలని నివేదికల్లో పేర్కొన్నారు.
ఆలయానికి విద్యుత్ కోసం ప్రత్యేక సబ్స్టేషన్, అర్చకుల వసతి గృహాలు, పరిచారకుల గృహాలు, దేవాలయ సిబ్బంది, కార్యనిర్వహణాధికారి, ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణం కోసం ప్రతిపాదించారు. కొండపైకి వెళ్లే దారి మధ్యన 50 గదుల చొప్పున రెండు ధర్మశాలల నిర్మాణంతోపాటు అశోక వనంలో స్వామి వారికి పూల తోట ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ మంజూరు చేసిన వంద కోట్ల నిధులతో ఈ పనులు చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే ఆగమ శాస్త్ర పండితులు,స్థపతులు క్షేత్రాన్ని పరిశీలించి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట నున్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం 100 కోట్లు మంజూరు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టు గుట్టపైన, కొండగట్టు దిగువన హన్మాన్ భక్తులు, ప్రజలు సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే కొడిమ్యాలలోనూ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
రుణపడి ఉంట..
కొండగట్టు క్షేత్ర అభివృద్ధికి వంద కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంట. కోట్లాది నిధులు మంజూరు చేస్తూ ఆలయాలను అభివృద్ధి చేయిస్తున్న ఘనత ఆయనకే దక్కుతుంది. గత ప్రభుత్వాల హయాంలో దేవాలయాలను చిన్నచూపు చూశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ యాదగిరి గుట్టను అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దారు. కోట్లాది రూపాయలతో వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కొండగట్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలోనే కొండగట్టు దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. దేశం ఆశ్చర్యపడేలా కొండగట్టు విరాజిల్లుతుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హిందూత్వం ముసుగులో ప్రజలను రెచ్చగొట్టడమే తప్పా ఆలయాల అభివృద్ధికి ఒక్క రూపాయి తేలేదు. అనవసర ఆరోపణలు మాని కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి నిధులు తెచ్చి మాట్లాడాలి. సీఎం కేసీఆర్ మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఇచ్చిన మాట నిలుపుకున్న మహానుభావుడు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంట. సీఎం కేసీఆర్తోపాటు మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్కు నా ప్రత్యేక ధన్యవాదాలు.
– చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్