భక్తుల కొంగు బంగారం కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయ పునః ప్రారంభోత్సవానికి వేళవుతున్నది. ఎన్నోఏండ్లుగా కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ఎంతో ప్రాశస్త్యం పొందిన ఆలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పునర్మిర్మాణానికి అడుగులు వేసింది. 40లక్షలు మంజూరు చేయడం, దానికితోడు చందాల రూపంలో మరో 60లక్షలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సమకూర్చారు. ఈ క్రమంలో చేపట్టిన నిర్మాణ పనులు, అనుబంధ ఆలయాల పనులు పూర్తికాగా, బుధవారం నుంచి పునఃప్రతిష్ఠాపనోత్సవాలు చేపట్టేందుకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.
కొడిమ్యాల, డిసెంబర్ 11: కొడిమ్యాల గుట్టపైన నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయ పునర్నిర్మాణం దాదాపు పూర్తయింది. గతంలో నిర్మించిన ఆలయం శిథిలావస్థలో ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం 40లక్షలు మంజూరు చేసింది. గ్రామస్తులందరూ చందాల రూపంలో మరో 60 లక్షలు సేకరించారు. గుట్టపై దాదాపు 30 గుంటల స్థలాన్ని చదును చేసి, 2020 డిసెంబర్ 17న ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆలయం చుట్టూ నాలుగు అనుబంధ స్వయంభువుగా వెలిసిన ఆలయంతోపాటు, కృష్ణ మందిర్, హనుమాన్, నవగ్రహాలు ఉప ఆలయాలు నిర్మించారు.
ఎత్తయిన గుట్టపైన నిర్మించిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయాన్ని కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా కొలుస్తారు. మండలకేంద్ర ప్రజలే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రతి శనివారం పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు. స్వామివారి గుట్టపైకి మెట్లదారితోపాటు వాహనాలు పైకి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కూడా ఉంటుంది. పండుగల సందర్భాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. 2017లో దేవాదాయ శాఖ ఆధీనంలోకి ఆలయాన్ని తీసుకోగా, నల్లగొండ శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ఈవో ఈ ఆలయానికి ఇన్చార్జి ఈవోగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ దసరా రోజు నిర్వహించే జంబి పూజ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఆలయ పునః ప్రతిష్టాపన ఉత్సవాలు ఈ నెల 13 నుంచి 17 దాకా వేదపండితుల సమక్షంలో నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి రోజూ ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు నిత్య పూర్ణాహుతి, తీర్థ్ధప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. 12న మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి ఆలయం దాకా విగ్రహాల ఊరేగింపు చేపట్టనున్నారు. 17న స్వామి వారికి ఎదుర్కోలు వసంతోత్సవం, శ్రీ అళర్మేల్ మంగ సమేత శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ అవరణంలో హోమ పూజకు, భక్తుల సౌకర్యార్ధం చలువ పందిళ్లు ఏర్పాట్లు చేశారు. చివరి రోజు శిలా విగ్రహాలతో భారీ ఊరేగింపు తీయనున్నారు.
శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయ పునః ప్రతిష్టాపన మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. ఉత్సవాలకు మండలంలోని ప్రతి ఇంటి నుంచి భక్తులు తరలివచ్చి విజయవంతం చేయాలి. ఆలయ ఆవరణలో దాతలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా విస్తృత ఏర్పాట్లు చేశాం.
– నాగరాజు రమేశ్, ఆలయ పూజారి