ధర్మారం, మే 2 : బట్టకాల్చి మీదేసి, అసత్య ప్రచారంతో ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలపై జనం తిరుగబడుతున్నారు. తరిమితరిమి కొడుతున్నరు. ఇందుకు మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి కొనుగోలు కేంద్ర వద్ద జరిగిన ఘటనే నిదర్శనంగా నిలుస్తున్నది. కాంగ్రెస్ నేత, జడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్కుమార్కు ఘోర అవమానం జరిగింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని కొందరిని వెంట వేసుకొని ఖిలావనపర్తిలోని కేంద్రం వద్ద ధర్నా చేసేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామంలోని రైతులు వెంటనే అక్కడికి చేరుకొని లక్ష్మణ్కుమార్పై తిరుగుబాటు చేశారు.
సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అకాల వర్షానికి తడిసిన ధాన్యం కొంటామని ప్రకటించారని, ‘మధ్యలో మీ రాజకీయం ఏంటని’ మండిపడ్డారు. రాస్తారోకో, ధర్నా చేయడం వల్ల తమకు కలిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న గ్రామ బీఆర్ఎస్ నాయకులు చేరుకుని సంఘీభావం తెలిపి వారి పక్షాన లక్ష్మణ్కుమార్పై ప్రశ్నల వర్షం కురిపించారు.
‘మీ పాలనలో రైతులను ఏనాడైనా పట్టించుకున్నారా..? వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్ ఇచ్చి రైతుల జీవితాలతో అడుకున్నది మీ ప్రభుత్వం కాదా..?’ అంటూ గులాబీ శ్రేణులు సైతం లక్ష్మణ్కుమార్ను నిలదీశారు. ఖిలావనపర్తి సెంటర్లో ఏనాడో కొనుగోళ్లు ప్రారంభమైతే.. ఇప్పుడు కావాలనే ధాన్యం కొనాలని ధర్నా చేయడంలో ఆంతర్యం ఏంటో చెప్పాలని రైతులు, బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగగా, పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపచేశారు. దీంతో చేసేదేమీలేక లక్ష్మణ్కుమార్ తోకముడిచి వెళ్లిపోయారు.