కార్పొరేషన్, సెప్టెంబర్ 11: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకు కూడా అందాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం స్థానిక ప్రతిమ మల్టీప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాక ముందు ఇక్కడి ప్రజల జీవనశైలి ఎలా ఉందనేది అందరూ చూశారని, సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా పాలనతో అద్భుత అభివృద్ధి ఫలితాలను చూపించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, 24 గంటల కరెంట్, నీటి వసతులు ఆయన వల్లే సాధ్యమయ్యాయని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. అనేక రాష్ర్టాల నుంచి ప్రతినిధులు వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటున్నారని, ఇప్పుడు ఆయన దేశ రాజకీయాల్లోకి రావాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోందన్నారు. తమకు ఒక ఆయుధం కావాలని, అది కేసీఆరేనని కోరుతున్నట్లు చెప్పారు. ఇక్కడి పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు కావాలని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో నదుల ద్వారా ఏటా 70 వేల నుంచి 80 వేల టీఎంసీల నీరు వృథాగా పోతున్నదని, ఆ నీరంతా పొలాల్లోకి రావాలంటే కేసీఆర్ రావాలని అంటున్నారని చెప్పారు. అవసరం మేర బొగ్గు, హైడ్రో వనరులు ఉన్నా ఇన్నాళ్లూ కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారని, కేసీఆర్ వస్తేనే కరెంట్ వస్తుందని ప్రజల నుంచి డిమాండ్ వస్తోందన్నారు. తాము కూడా కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి, రైతుల బాగు కోసం కృషి చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. దేశం మొత్తం సుఖసంతోషాలతో ఉండాలని తామంతా ఆయనకు విన్నవిస్తున్నట్లు చెప్పారు. అతి త్వరలోనే దేశ పగ్గాలు పట్టాలని, ఒక్కసారి జాతీయ పార్టీ ప్రకటిస్తే దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. మళ్లీ బీజేపీ వస్తే ఎల్ఐసీ, రైల్వే, రోడ్లు ఇలా అన్నింటినీ విక్రయిస్తారని, అందుకే ఆ పార్టీకి అనుకూలంగా ఎవరూ పోయే పరిస్థితి లేదన్నారు.
దేశంలో కాంగ్రెస్ పూర్తిగా వీక్ అయ్యిందని, ఇక ప్రత్యామ్నాయంగా కేసీఆర్ మాత్రమే దేశ ప్రజలకు కనిపిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక్కరే ఉన్నారని, ఇప్పుడు ఒక్కసారి జాతీయ ఎజెండా ప్రకటిస్తే అన్ని పార్టీలు, నాయకులు ఆయన వెంట నడుస్తారని స్పష్టం చేశారు. ఎజెండాకు ప్రజలు అనుకూలంగా ఉంటే అందరూ ఆయన వెంట ఉండాల్సిందేనని, పక్కన ఉన్న జగన్ కూడా రావాల్సిందేనని చెప్పారు. జాప్యం చేయకుండా దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ డబ్బులను కూడా కేంద్రం ధరలను పెంచి దోచుకుంటున్నదని, కేసీఆర్ దేశ ప్రధాని అయితే సంక్షేమం జరుగుతుందని ప్రజలంతా కోరుకుంటున్నట్లు తెలిపారు. దేశ సంపద పెరుగాలంటే.. సంపద ప్రజలందరికీ అందాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రోజు రోజుకూ పడిపోతున్న రూపాయి విలువను కాపాడడం కేసీఆర్తో సాధ్యమవుతుందన్నారు. ఆహార సంక్షోభం రాకుండా రెండు, మూడేళ్లకు అవసరమైన ఆహారాన్ని సిద్ధంగా ఉంచాలని సీఎం కేసీఆర్ గతంలో సూచించారని, కానీ కేంద్ర ప్రభుత్వం వరి పండించవద్దని, పండిన పంటను కొననని చెప్పి ఇప్పుడు నూకల ఎగుమతులపై ఆంక్షలు విధించిందన్నారు. అడ్డగోలు నిర్ణయాల వల్ల దేశంలో ఆహార సంక్షోభం వచ్చే పరిస్థితులు ఎదురవుతున్నాయని, పక్క దేశాలు కూడా బియ్యం కోసం మన దేశం వైపు చూస్తున్నాయని తెలిపారు. వీటిని అందించే అవకాశం భారతదేశానికి మాత్రమే ఉందన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మేయర్ వై సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా బాగుపడుతరు..
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దక్షతతో ఇక్కడి ఉద్యోగులు సుఖసంతోషాలతో ఉన్నారు. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశమంతటా ఉద్యోగులు బాగుంటారు. కేంద్రం ఆధీనంలోని ప్రభుత్వ సంస్థలను దాదాపు అన్నింటినీ ప్రైవేటీకరణ చేసినా, టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది. పీఆర్సీ అమలు, ప్రమోషన్లు, ఇతర సమస్యలు పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. అలాంటి వ్యక్తి కేంద్రంలో ఉంటే దేశంలోని అన్ని శాఖల ఉద్యోగులకు మేలు జరుగుతుంది. దేశంలో ఎంతో మంది ప్రధానులు వచ్చినా కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయలేదు. కానీ, ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాత్రం అన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తుండడం బాధాకరమైన విషయం. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే కేసీఆర్ లాంటి ప్రభుత్వం కావాలని, ప్రజలకు నష్టం కలిగించే మోదీ ప్రభుత్వం అవసరం లేదని ప్రజలు చెప్పుకొంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లాంటి ప్రభుత్వమే కేంద్రంలో కూడా ఏర్పడినట్లయితే అన్ని వర్గాల ప్రజలు, రైతులు, ఉద్యోగులు సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు.
-రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ (హుజూరాబాద్టౌన్)