సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కేసీఆర్కు దేశంపై కూడా ఒక విజన్ ఉంది. ఆయనతోనే ఈ దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ విషయంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే పెనుమార్పులు జరుగుతాయి. తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యోగిగా ప్రత్యక్షంగా పాల్గొన్న నేను, కేసీఆర్ను అతి దగ్గరగా చూశా. ఆయన ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. తలుచుకున్న పని పూర్తయ్యేదాకా నిద్రపోరు. నిత్యం ప్రజల సంక్షేమం గురించి తపిస్తారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ఆయన, ప్రభుత్వ పాలనలో భాగమైన ఉద్యోగులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. రిటైర్డ్ అయిన తర్వాత ఆత్మగౌరవంతో బతికేలా చూస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పెన్షన్ సదుపాయం ఒక్క తెలంగాణ విశ్రాంత ఉద్యోగులకే కల్పించారు. ఇక్కడ ఉద్యోగులకు వేతనాలు పెరిగినప్పుడల్లా దేశమంతా చర్చ జరుగుతున్నది. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశంలోని ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు, కర్షకులే కాకుండా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఆయన రాక కోసం దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి తమ రాష్ర్టాల్లోనూ జరగాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఉచిత విద్యుత్తును, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు తమ వద్ద అమలు కావాలని రైతులు ఆశపడుతున్నారు. అతి తక్కువ కాలంలోనే రాష్ర్టాన్ని అన్నింటా ఆదర్శంగా నిలిపిన కేసీఆర్, దేశాన్ని కూడా అలానే అభివృద్ధి చేసి చూపిస్తారనే నమ్మకం నాకున్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుతో అంధకారంలో మగ్గుతున్న కర్షకలోకాన్ని వెలుగుల్లోకి తేవాలన్నా.. దేశంలో సాగు పండుగలా మారాలన్నా.. ఉచిత కరెంట్, రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాలు దేశమంతా అమలు కావాలన్నా.. రైతులే కాదు, అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్నా.. ఈ మాతృభూమి కోసం ఆలోచించే సమర్థుడైన నాయకుడు రావాలి.. అది తెలంగాణను అన్నింటా ఆదర్శంగా నిలిపిన కేసీఆరే కావాలి.. అని రిటైర్డ్ ఉద్యోగులు, సంఘాల నాయకులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికం.. ఇలా అన్ని రంగాలను ప్రగతి పథంలో తీసుకెళ్తున్న ఆయన దేశానికి అవసరమని స్పష్టం చేస్తున్నారు. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే రైతులే కాదు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, సామాన్య, మధ్య తరగతి ప్రజలందరికీ మేలవుతుందని అభిప్రాయపడుతున్నారు. అందుకే రాష్ట్రంలో ఏది జరిగినా దేశ ప్రజల్లో చర్చ జరుగుతున్నదని, ఇదే ఆయన పాలనకు నిదర్శనమని చెబుతున్నారు.
పీఆర్సీలో పెంపులో తెలంగాణ దేశానికే దిక్సూచి..
తెలంగాణలో రిటైర్డు ఉద్యోగులు సంతోషంగా ఉన్నరు. ఎందుకంటే ఉద్యోగులకు ఎనిమిదేండ్ల కాలంలో రెండు విడతల్లో ఫిట్మెంట్ 73 శాతం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. తెలంగాణలో ఇచ్చినట్లుగా తమకూ ఇవ్వాలని ఇతర రాష్ట్రాల ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. అయితే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి, జాతీయ రాజకీయాల్లోకి రావాలని చాలా మంది దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మాకు కూడా అమలు చేస్తారనే నమ్మకంతో ఉన్నరు. సీపీఎస్ రద్దు, ఇన్కం టాక్స్ పరిధి పెంపు లాంటి సమస్యలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే విధంగా లేదు. ఆ సమస్యలను పరిష్కరించే సమర్థత గల నాయకుడు కేసీఆర్. బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేసే విధంగా ప్రయాత్నాలు చేస్తోంది. కార్పొరేట్ శక్తులకు దోచిపెడు తుంది. మతతత్వ బీజేపీ కుట్రలను తిప్పి కొట్టి, భారత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడు కేసీఆర్ అని నా అభిప్రాయం. రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీని పాతర పెట్టే అవకాశముంది. కాబట్టి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో దూకుడు పెంచాలి.
– ఎంఏ హమీద్, టీఎన్జీవో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఉద్యోగి(పెద్దపల్లి).
దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశం అభివృద్ధి బాట పడుతుంది. తెలంగాణ సాధించిన కేసీఆర్ ఎనిమిదేళ్ల తన పాలనలోనే అనేక అద్భుతాలను చేసి చూపించారు. ఒక నాడు తెలంగాణలో సాగునీటి కోసం విద్యుత్ కోసం అష్టకష్టాలు పడ్డ పరిస్థితుల నుంచి కేవలం నాలుగు నెలల్లోనే విద్యుత్ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి తెలంగాణ వ్యాపంగా 24 గంటల కరెంటు అందించిన ఘనత కేసీఆర్ది. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేసి రాష్ట్రంలోని అత్యధిక జిల్లాలకు సాగు, తాగునీరు అందిస్తున్నారు. మరో వైపు రాష్ట్ర ఉద్యోగులకు ఫ్రెండ్లీ నేచర్లో ఉంటూ వారు అడుగకముందే అత్యధికంగా ఫిట్మెంట్ ప్రకటించిన కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాల్లో అధికారులను భాగస్వాములను చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని రాష్ర్టాలు ఇప్పుడు తెలంగాణలో ఎనిమిదేండ్లో జరిగిన అభివృద్ధిపై విశ్లేషణలు చేసుకుంటున్నాయి. తమ రాష్ర్టాల్లో వీటిని అమలు చేయవచ్చన్న ఆలోచన చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ జాతీయ రాజకీయల్లోకి వస్తే తెలంగాణ పథకాలన్నీ దేశ వ్యాప్తంగా అమలు చేస్తే బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ సంతోషంగా ఉండే అవకాశం ఉంది.
– వేదాంతం సత్యనారాయణ, రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి (పశు సంవర్ధక శాఖ) (కరీంనగర్ కార్పొరేషన్)
ప్రజా సంక్షేమం కోరే నాయకుడు
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతు బంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దళితబంధు పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఈ పథకాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. అన్ని రాష్ర్టాలు సైతం ఈ పథకాలను అమలు చేయాలని ఆలోచిస్తున్నాయి. ఇలాంటి పథకాలు అమలు చేస్తున్న నాయకుడు దేశ రాజకీయాల్లోకి వస్తే భారతదేశానికే గుర్తింపు వస్తుంది. ఉద్యమస్ఫూర్తి, ప్రజల అభివృద్ధే ఆకాంక్షగా పనిచేస్తున్న కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిన సమయం కూడా ఆసన్నమైంది.
– చల్ల సత్తయ్యయాదవ్, రిటైర్డ్ ఉద్యోగి (వేములవాడ)
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి
కేంద్రం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కూడా ప్రైవేటీకరణకు సిద్ధమైంది. వీటిని కాపాడాలంటే సత్తాగల నాయకుడైన కేసీఆర్కే సాధ్యం. 70ఏండ్లలో సాధించనిది కేవలం ఎనిమిదేండ్లలో సాధించి అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను దేశానికి స్ఫూర్తిగా నిలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో భవన నిర్మాణ రంగం, చేనేత, పవర్లూం పరిశ్రమలు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాయి. బిహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహరాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి కోసం తెలంగాణకు వలస వస్తున్నారు. ఇక్కడ అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందాలి. ఫలాలు పొందే హక్కు అందరికీ ఉండాలంటే కేసీఆర్ దేశ రాజకీయాలలో దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది.
– బలరాం, కార్మిక శాఖ జిల్లా విశ్రాంత అధికారి (సిరిసిల్ల)
పల్లెలన్నీ ప్రగతి సాధిస్తాయి..
పోరాడి సాధించిన రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో తీర్చిదిద్దారు. ముఖ్యంగా గ్రామాల ప్రగతి కోసం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి పల్లెలను సమాన అభివృద్ధి చేశారు. సర్పంచ్లకు, పాలకవర్గ సభ్యులకు విధులు, బాధ్యతలు, నిధులను ఇచ్చారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి, గ్రామాల రూపురేఖలే మార్చివేశారు. ఒకప్పుడు పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి అరకొర జీతాలు మాత్రమే అందేవి. అది కూడా ఎప్పుడో ఏడాదికి ఓసారి వచ్చేవి. కానీ, సీఎం సార్ అధికారంలోకి రాగానే రూ.8,500కు పెంచారు. నెలనెలా ఇస్తున్నారు. అప్పటిదాకా అర్ధాకలితో నిత్యం ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ నిర్లక్ష్యంగా పనిచేసే పారిశుధ్య సిబ్బంది కడుపు నిండా బువ్వ దొరకడంతో చాలా చక్కగా పనిచేశారు. గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధించి, దేశంలోనే ఉత్తమ గ్రామాలుగా అవార్డులు సాధించాయి. ఇంకా పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాల ఏర్పాటు, కొత్త మండలాల ఏర్పాటు జరిగింది. దీంతో అధికారుల పర్యవేక్షణ పెరిగి గ్రామాలు అభివృద్ధిని సాధించాయి. నేను డీపీవోగా పనిచేస్తున్న సమయంలోనే పెద్దపల్లికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ జిల్లాగా, ఉత్తమ మండలాలుగా, ఉత్తమ గ్రామాలుగా అనేక అవార్డులు దక్కాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఇలా దేశంలోని గ్రామ పంచాయతీలన్నీ సమానంగా అభివృద్ధి చెంది. ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దబడుతాయి. భారత్ ఉత్తమ దేశంగా అభివృద్ధి చెందుతుంది.
– వేముల సుదర్శన్, రిటైర్డ్ డీపీఓ (పెద్దపల్లి)
ఉద్యమ వీరుడితోనే దేశం మారుతుంది
తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశంలో సుపరిపాలన సాధ్యమవుతుంది. మోదీని ఎదుర్కొనే సత్తా కేసీఆర్కే ఉందని దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నేతలు, మేధావులు, ప్రజా సంఘాల తెలంగాణ ఉద్యమ కారులు గుర్తిస్తున్నారు. మత విద్వేషాలను కూకటి వేళ్లతో పెకిలించి రైతు రాజ్య స్థాపనతో పాటు అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే జాతీయ నేతగా కేసీఆర్ దేశ రాజకీయాల్లో రాణిస్తారు.
– హరి అశోక్కుమార్, పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు(జగిత్యాల)
కేసీఆర్ రావాలి..
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ, భద్రతలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉంది. షీటీమ్స్, భరోసా, సఖీ కేంద్రాలు, వీ హబ్ ఏర్పాటు చేసి మహిళలకు అత్యంత రక్షణ కల్పిస్తున్నారు. దేశంలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత కోసం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ముక్తకంఠంతో మా మహిళలు కోరుతున్నారు.
– బీ కరుణ, తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా మహిళా కార్యదర్శి(జగిత్యాల)
బీజేపీకి వణుకు మొదలైంది..
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న విషయం తెలియడంతో బీజేపీకి వణుకు మొదలైంది. బీజేపీ పాలితేతర రాష్ర్టాల సీఎంలు మోడీ పరిపాలనతో విసుగు చెందారు. ఈ తరణంలో కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతుండడంతో ఆయా రాష్ర్టాల సీఎంల మద్దతు తప్పకుండా వస్తుంది. చాలా మంది సీఎంలకు బీజేపీని వ్యతిరేకించాలనే ఆలోచన ఉన్నా ఇప్పటివరకు సరైన అడుగు ఎవరూ వేయలేదు. ధైర్యం, దమ్ము ఉన్న కేసీఆర్ ఆ లోటును పూడ్చుతుండడంతో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు. విజన్ ఉన్న నాయకుడు దేశ రాజకీయాల్లోకి వస్తే దేశ భవిష్యత్ మారుతుంది. ఎనిమిదేళ్లుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందువరుసలో ఉంచడమే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఇదే తరహాలో దేశానికి ప్రపంచపటంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం మెరుగుపడింది. ఇతర రాష్ర్టాల గ్రామాలతో పోల్చుకుంటే ఇక్కడి పల్లెలు చాలా ముందంజలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం ప్రక్రియ కూడా కేసీఆర్తోనే అవుతుంది. ఇది చేస్తే రాష్ట్రం మాదిరిగానే దేశం మొత్తం సస్యశ్యామలమవుతుంది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసే అవకాశం ఉంటుంది. ప్రాణాలను సైతం తెగించి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకురావడం అసాధ్యమేమీ కాదు.
– బెల్లి రాజయ్య, రిటైర్డ్ టీచర్, కందుగుల(హుజూరాబాద్)
బంగారు భారతదేశం కావాలి
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తేనే బంగారు తెలంగాణ రీతిలోనే బంగారు భారత దేశంగా మార్పు సాధ్యం. కేసీఆర్కు మా పెన్షనర్స్ సీనియర్ సిటిజన్స్ సంపూర్ణ మద్దతునిస్తాం. గడిచిన ఎనిమిది ఏండ్లలో పేద, బడుగు, బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు పడ్డాయి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలి. సరైన జాతీయ నాయకుడి కోసం ఎదురుచూస్తున్న వారందరికీ కల్ప వృక్షంలా కేసీఆర్ ఉండాలనే సంపూర్ణ విశ్వాసం ప్రజల్లో ఉంది.
– గౌరిశెట్టి విశ్వనాథం, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి (జగిత్యాల)
విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతాయి
సమైక్య పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి ఉండేది. వ్యవసాయ రంగంతో పాటు కరెంటుపైన ఆధార పడ్డ అన్ని పరిశ్రమలు సంక్షోభాన్ని చవిచూశాయి. వేలాది మంది ఉపాధి కోల్పోయి, బొంబాయి, దుబాయికి వలస వెళ్లారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఫలితంగా తెలంగాణలో వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు ఇవ్వడంతో పాటు పరిశ్రమలకు 24గంటలు కరెంటు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనకు ఇదే నిదర్శనం. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని రంగాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయంటే పాలన పట్ల ఆయనకు ఉన్న చిత్త శుద్ధి, కార్యదక్షతను కొనియాడకు తప్పదు. అలాంటి వ్యక్తి దేశరాజకీయాల్లోకి వచ్చి ప్రధాని అయితే ప్రపంచం గర్వించేలా దేశాన్ని నిలబెడుతారన్న నమ్మకం ఉంది.
– నేరేళ్ల వెంకటయ్య, విద్యుత్ సంస్థ విశ్రాంత ఫోర్మెన్ (సిరిసిల్ల)