ధర్మపురి, సెప్టెంబర్ 29 : కేసీఆర్ సర్కారు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందని, రోడ్ ట్యాక్స్, గతంలో ఉన్న బకాయిలను రద్దు చేసిందని, భవిష్యత్లోనూ అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసానిచ్చారు. ప్రజారవాణాలో ఆటోవాలాల పాత్ర కీలకమని ప్రశంసించారు. శుక్రవారం ధర్మపురి ఎస్హెచ్ గార్డెన్స్లో ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 1,892 మంది ఆటోడ్రైవర్లు, పారిశుధ్య సిబ్బందికి హెల్త్ కార్డులను పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. పారిశుధ్య కార్మికులు లేనిదే ప్రజారోగ్యం లేదన్నారు. వారు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందిస్తారని పేర్కొన్నారు. కరోనా కాలంలో అమూల్యమైన సేవలందించారని చెప్పారు. ఆటో డ్రైవర్లు, పారిశుధ్య సిబ్బంది ఏదేని పరిస్థితుల్లో అనారోగ్యం బారినపడితే చేతిలో చిల్లిగవ్వలేక చికిత్స చేయించుకోని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటారన్నా రు.
ఈ నేపథ్యంలో ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ ద్వారా హెల్త్కార్డులు అందిస్తున్నామన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఊరూరా హెల్త్క్యాంపు లు నిర్వహించి క్యాన్సర్, గుండెజబ్బులను కూడా ముందస్తుగా గుర్తించి వందలాది మంది ప్రాణాలు కాపాడగలిగామన్నారు. శ్రీ తులసీ హెల్త్కేర్ సర్వీసెస్ ద్వారా 1892 మందికి 2 వేల చొప్పున మొత్తం 37.87 లక్షలు వెచ్చించి కార్డులు అందించామని తెలిపారు. ఈ కార్డుల ద్వారా ఉమ్మడి జిల్లాలోని 54 దవాఖానల్లో 40 శాతం డిస్కౌంట్తో చికిత్స పొందవచ్చన్నారు.
అలాగే లక్ష బీమా సౌకర్యం వర్తిస్తుందని పేర్కొన్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ చార్జీలు, పేషెంట్ ఫుడ్, పేషెంట్ కిట్, పేషెంట్ లిక్విడ్ను అందజేస్తారన్నారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, ధర్మపురి అటో యూనియన్ సలహాదారు మొలుగూరి రాజన్న, అటో యూనియన్ అధ్యక్షుడు మొలుగూరి రమేశ్, ధర్మారం, ఎండపల్లి, కొత్తూరు, పాతగూడురు అధ్యక్షులు సాగర్, సతీశ్, రమేశ్, సతీశ్, పైడిపెల్లి మహేందర్, బుగ్గారం, పెగడపల్లి, గుల్లకోట అధ్యక్షులు తిరుపతి, స్వామి, లక్ష్మణ్, అటో కార్మికుడు మాజిద్ ఉన్నారు