తెలంగాణ సాధకుడు, అపరభగీరథుడు సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా ముందస్తు వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రజాప్రతినిధులు, నాయకులు కేకులు కోసి, స్వీట్లు పంచి, పటాకులు కాల్చారు. కేసీఆర్ ప్రధాని కావాలని, నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పలువురు పూజలు, ఆలయాలకు పాదయాత్ర చేయగా, మరోవైపు పలువురు సేవా కార్యక్రమాలు చేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఖనిలో 23వేల మంది మహిళలకు చీరెలు పంపిణీ చేయగా, రామగుండం ఎమ్మెల్యే చందర్ ఆరు నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించి అభిమానాన్ని చాటుకున్నారు.
నమస్తే నెట్వర్క్, ఫిబ్రవరి 16 : ప్రగతి రథసారథి, జననేత సీఎం కేసీఆర్పై సకలజనం అభిమానాన్ని చాటుకున్నది. శుక్రవారం జన్మదినం సందర్భంగా ముందస్తుగా గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించింది. మరింత ఉన్నస్థాయికి ఎదగాలని, నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీనివాస కల్యాణం, పాదయాత్రలు చేపట్టింది. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పెండ్లి పెద్దగా ఆరు నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించగా, గోదావరిఖనిలో మహిళలకు రాష్ట్ర పోలీసింగ్ కార్పొరేషన్ 23వేల చీరలు పంపిణీ చేశారు. ఇక తమ అభిమాన నాయకుడు వందేళ్లు వర్ధిల్లాలని నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో అర్చకులు కేసీఆర్ గోత్రనామాలతో అర్చనలు చేయాలని నిర్ణయించింది.
జిల్లాలో ముందస్తు వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కుల సంఘాల జేఏసీ చైర్మన్ జీఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని జ్యోతిరావుఫూలే పార్కులో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అలాగే అదే చోట బీఆర్ఎస్ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు, సుడా డైరెక్టర్ షేక్ యూసుఫ్ కేక్ కట్ చేసి, పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. కరీంనగర్లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహించగా, జడ్పీ అధ్యక్షురాలు విజయ, గరిమా అగర్వాల్ హాజరయ్యారు. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా స్థాయి చెస్ చాంపియన్ షిప్ పోటీలకు ఎమ్మెల్యే సంజయ్కుమార్, అదనపు కలెక్టర్ మంద మకరంద హాజరయ్యారు.
పాదయాత్రను ప్రారంభిస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్
కేసీఆర్ ప్రధాని కావాలి
బీఆర్ఎస్ నాయకుడి పాదయాత్ర
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 16: సీఎం కేసీఆర్ నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ యువనాయకుడు సాయివికాస్ గురువారం పాదయాత్ర చేపట్టారు. సిరిసిల్లలోని వేంకటేశ్వర ఆలయం నుంచి వేములవాడలోని అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయం దాకా యాత్ర చేపట్టారు. కాగా, అంతకుముందు పాదయాత్రను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశానికే మార్గదర్శకంగా నిలిపారని చెప్పారు. సాయివికాస్ మాట్లాడుతూ, ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో కేసీర్ నూరేళ్ల పాటు కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్ కాలంలో కేసీఆర్ దేశానికి ప్రధాని అవుతారని ఆకాంక్షించారు. ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, పత్తిపాక శివచరణ్, ఆడెపు శ్రీరామ్, తాళ్లపల్లి అఖిల్గౌడ్, బార్గవ్, గాజుల సుమిత్, మనోజ్గౌడ్, రాకేష్, దుర్గాప్రసాద్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నేడు కేసీఆర్ పేరు, గోత్రంతో అర్చనలు
తెలంగాణ డీడీఎన్ అర్చక సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆంజనేయ చార్య
కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 16: సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గోత్ర నామాలతో అర్చన నిర్వహించనున్నట్లు సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆంజనేయ చార్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ధూప, దీప నైవేధ్య ఆర్థిక సమాఖ్య రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ధూప, దీప నైవేధ్య ఆలయాల అర్చకులు రేచర్ల గోత్రం, కల్వకుంట్ల చంద్రశేఖర రావు, శోభ పేరిట పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆధ్యాత్మికానికి గౌరవం ఇచ్చి, అర్చకులకు సముచిత స్థానం కల్పిస్తున్న ముఖ్యమంత్రికి తమవంతుగా ఈ విధంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వివరించారు.