హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ ఫుట్బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ను తెలంగాణ ప్రభుత్వం మరో కోణంలో చూసింది. ఆటలను ప్రోత్సహించి, క్రీడాస్ఫూర్తిని పెంచే అవకాశాన్ని, మద్యం విక్రయాలను పెంచుకొనేందుకు వాడుకుంటున్నది. ఫుట్బాల్ మ్యాచ్ల పేరుతో అర్ధరాత్రి దాటి తెల్లవారుజాము వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం శనివారం జరిగే థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు, ఫైనల్ మ్యాచ్ జరిగే ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు జామున 3 గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతి కల్పించారు. ఈ వెసులుబాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు వర్తించనుంది. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ప్రజారోగ్యం, శాంతిభద్రతలు, యువత సంక్షేమం వంటి అంశాల కంటే మద్యం వ్యాపారుల అభ్యర్థనకే ప్రాధాన్యం ఇవ్వటం ప్రభుత్వ ఆదాయ దాహాన్ని బయటపెట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏం సందేశమిస్తున్నట్టు?
ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలను మద్యపానానికి దూరంగా ఉంచాల్సిన ప్రభుత్వమే, ప్రత్యేక సందర్భాలను చూపించి మద్యం విక్రయాల సమయాన్ని పెంచడం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తున్నదన్న చర్చ జరుగుతున్నది. ఫుట్బాల్ మ్యాచ్ చూడాలంటే మద్యం తప్పనిసరి అన్న భావనను ప్రభుత్వం పరోక్షంగా బలపరుస్తున్నదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం వినియోగం పెరుగుతున్నదని, యువతలో మద్యపాన అలవాటు సామాజిక సమస్యగా మారుతున్నదని నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విమర్శలకు తావిస్తున్నది. ఓవైపు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు అర్ధరాత్రి దాటి మద్యం విక్రయాలకు అనుమతించడమంటే విధానపరమైన వైరుధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సమాజానికి ఏం ప్రయోజనం?
పండుగలు, క్రికెట్, ఇప్పుడు ఫుట్ బాల్.. ఇలా ప్రతి ప్రత్యేక సందర్భానికీ మద్యం విక్రయాల సమయాన్ని పెంచడం ఆనవాయితీగా మారితే, అది ప్రభుత్వానికి ఆదాయం తేవచ్చు గానీ సమాజానికి ఎలాంటి ప్రయోజనం కలిగిస్తుందన్న ప్రశ్న ఎదురవుతున్నది. ముఖ్యంగా యువత ఎకువగా పాల్గొనే అంతర్జాతీయ క్రీడా వేడుకను మద్యం విక్రయాలతో ముడిపెట్టడం సమంజసమేనా? అనే చర్చ మొదలైంది. ప్రభుత్వం దీనిని కేవలం వ్యాపార సమయాల పొడిగింపుగా పేరొంటున్నా, సామాజికకవేత్తలు మాత్రం దీనిని ‘ఆట పేరుతో మద్యం సంసృతిని అధికారిక ప్రోత్సాహించడమే’నని తేల్చిచెప్తున్నారు. క్రీడాస్ఫూర్తిని పెంపొందించే అవకాశాన్ని, మద్యం అమ్మకాల అవకాశంగా మార్చుకోవడం సరైన ప్రజా విధానమా? అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.