జగిత్యాల రూరల్, మార్చి 19: పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని మోడీ తన బ్రహ్మాస్త్రమైన ఈడీని వాడుతున్నారని ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్.. అనేది బీజేపీ అల్లిన కట్టుకథ అని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్తో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ను అణగదొక్కేందుకు.. ప్రాంతీయ పార్టీలు రాష్ర్టాల్లో అధికారంలో ఉండకూడదనే ఉద్దేశంతోనే మోదీ, అమిత్షా డైరెక్షన్లో కవితను అన్యాయంగా అరెస్టు చేశారని విమర్శించారు. జగిత్యాల సభలో ‘సబ్కూచ్ ఖరా’ అని మోడీ చెప్పారని.. అసలు ‘తెలంగాణ క్యా ఖరా’ చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత నిర్దోషిగా బయటకు వస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక కావాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ని గెలిపించాలన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల ముందు ఈడీ కవితను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ న్యాయ పోరాటంలో ప్రజలంతా కవితవైపే ఉన్నారన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఈడీ చాలా కేసులు నమోదు చేస్తే, అందులో 0.01 శాతం కూడా ఫ్రూవ్ కాలేదన్నా రు. అవినీతిపరులంతా బీజేపీలో ఉన్నారని, ఆ పార్టీలో చేరితే కేసులు మాఫీ అవుతాయన్నారు. కేసీఆర్ తెలంగాణ దాటివస్తే బీజేపీకి మనుగడ ఉండదనే ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, బీజేపీ అధికారంలో ఉండగా ఉత్తమ పార్లమెంట్ అవార్డు తీసుకున్న కవితను కేవలం ఎన్నికల స్టంట్ కోసమే అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బీజేపీలో చేరితే ఎన్ని కేసులు ఉన్నా వాషింగ్ పౌడర్ నిర్మాలా మారుతారన్నారు. ముందు రాజకీయాలు మాని.. రాష్ట్రంలో రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరకుంటే వ్యక్తిగతంగా బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు గట్టు సతీశ్, బాల ముకుందం, ఒద్ది రామ్మోహన్ రావు, దారిశెట్టి రాజేశ్, దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.