కార్పొరేషన్, డిసెంబర్ 8: దళిత బంధు ప్రతిష్ట్టాత్మకమైన పథకమని, పకడ్బందీగా అమలు చేసి ఆశించిన ఫలితాలు వచ్చేలా చూడాలని కలెక్టర్ కర్ణన్, సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. గురువారం మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో తేనేటి విందు సందర్భంగా కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ఇంకా కావాల్సిన అవసరాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ఫ్రంట్ పనులపై ఆరా తీయగా, మంత్రి గంగుల కమలాకర్ పనుల పురోగతిని వివరించారు. వీటితో పాటుగా కార్పొరేషన్ పరిధిలో రోడ్ల పనులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న అన్ని పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. మొత్తంగా జిల్లాలో జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, ఇంకా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కావాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని, మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సీఎం తెలిపినట్లుగా నాయకులు చెప్పారు.
జిల్లాలో అమలవుతున్న దళిత బంధు గురించి సీఎం కేసీఆర్ కలెక్టర్ కర్ణన్ను అడిగి తెలుసుకున్నారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు సెక్టార్లవారీగా యూనిట్ల వివరాలు, లబ్ధిదారుల విజయగాథలు పొందుపరిచిన బుక్లెట్ను సీఎంకు కలెక్టర్ అందజేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 18,021 దళితబంధు (హుజూరాబాద్ 14049 యూనిట్లు, ప్రస్తుత హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో 3972) యూనిట్లను గ్రౌండింగ్ చేశామని వివరించారు. పథకం మొదలు పెట్టకముందు దళితుల ఆర్థిక, సామాజిక స్థితిగతులు, ప్రస్తుతం పొందిన కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలు, హార్వెస్టర్, కిరాణా దుకాణాల యూనిట్లతో ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన తీరు, తదితర వివరాలను బుక్ లెట్లో పొందుపరిచినట్లు సీఎంకు వివరించారు. దళితబంధు అమలు తీరుపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేస్తూ కలెక్టర్ను అభినందించారు.