నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప పోరులో మన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు సారథులై కదలనున్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధిష్టానం ఆదేశాల మేరకు ముగ్గురు మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సహా 12 మంది నేటి నుంచి రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తమ వెంట తీసుకెళ్లాల్సిన శ్రేణులను సిద్ధం చేసి, శుక్రవారం నుంచే తమకు కేటాయించిన ప్రాంతాలకు చేరుకుంటున్నారు. శనివారం నుంచే క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించి, సర్కారు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఇంటింటా వివరించనున్నారు. బీజేపీ, కాంగ్రెస్ తీరును ఎండగట్టి ఓటర్లను చైతన్య పరచనున్నారు. గులాబీ అభ్యర్థిని విజయతీరాలకు చేరుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 7, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో మన జిల్లా ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సహా 12 మంది నేటి నుంచి రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే తమ వెంట రావాల్సిన శ్రేణులకు సిద్ధం చేసి, శుక్రవారం సాయంత్రం నుంచే బయలు దేరుతున్నారు.
పార్టీ అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేరుస్తామని, గులాబీ అభ్యర్థిని విజయతీరాలకు చేరుస్తామని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి నియమితులపై ఇన్చార్జీలు, వారికి కేటాయించిన మున్సిపల్ వార్డులు, మండలాలు, గ్రామాల వివరాలు ఇలా ఉన్నాయి.
కేటీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి
కేటాయించిన ప్రాంతం : చండూరు మండలం చౌటుప్పల్ -1 ఎంపీటీసీ ప్రాంతం
కొప్పుల ఈశ్వర్, ధర్మపురి ఎమ్మెల్యే, ఎస్సీ, మైనారిటీ, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ మంత్రి
కేటాయించిన ప్రాంతం : చండూరు మండలంలోని బొడంగిపర్తి, తస్కాని గూడం, శిర్డేపల్లి గ్రామాలు
గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి
కేటాయించిన ప్రాంతం : నారాయణపూర్ మండలం నారాయణ పూర్-2 ఎంపీటీసీ స్థానం