పెద్దపల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి కమాన్ :జాతీయ ఇన్స్పైర్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు మెరిశారు. తమ ఆవిష్కరణలతో సత్తా చాటారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించిన ఇన్స్పైర్ జాతీయ ప్రదర్శనకు రాష్ట్రం నుంచి 36 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా అన్ని రాష్ర్టాల నుంచి వచ్చిన ఎగ్జిబిట్లలో అత్యుత్తమైన 60 ప్రాజెక్ట్లను ఎంపిక చేసి అవార్డులు అందజేయగా, అందులో తెలంగాకు చెందినవే ఎనిమిది ప్రాజెక్టులు ఉండగా, పెద్దపల్లి జిల్లావి రెండు ఉన్నాయి. ఓదెల మండలం కొలనూర్కు చెందిన ముస్త్యాల పూజశ్రీ తయారు చేసిన ‘ఆగ్జిల్ కెమెరా’, మంథని మండలం దుబ్బపల్లికి చెందిన దాసరి హర్షిత తయారు చేసిన ‘కామన్మ్యాన్ హెల్మెట్’ ప్రాజెక్టులు 2023మార్చిలో రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్ర ప్రెన్యూర్ షిప్కు ఎంపికయ్యాయి.
ప్రాణాలు కాపాడే ‘కామన్మ్యాన్ హెల్మెట్’
దుబ్బపల్లికి చెందిన దాసరి మహేశ్-స్వప్న కూతురు హర్షిత. రామగిరి మండలం చందనాపూర్లోని ప్రభుత్వ బడిలో 9వ తరగతి చదువుతున్నది. పాఠశాల ఉపాధ్యాయుడు తాడూరి సంపత్కుమార్ ప్రోత్సాహంతో అనేక రకాల నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆమె ఇప్పటికే 7 అవార్డులను అందుకున్నది. అయితే తాజాగా ఆమె కుల వృత్తులు, ఇతర వృత్తులు చేసుకునే వ్యక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ‘కామన్ మ్యాన్ మల్టిఫుల్ హెల్మెట్’ను రూపొందించింది. వెల్డర్స్, కార్పెంటర్స్, రైతులు పంటలకు మందులు పిచికారీ చేసేటప్పుడు ఈ హెల్మెట్ను ధరించడం వల్ల దుమ్ము, పొగ, ఇతర విష వాయువుల నుంచి ప్రాణాపాయం కలుగకుండా కాపాడుతుంది. ఈ హెల్మెట్లో రెండు ఫ్యాన్లు, పొగను గుర్తించే సెన్సార్ ఉంటుంది. బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంది. దుమ్ము, పొగ మన దరిచేరగానే సెన్సార్ దానిని గుర్తించి, హెల్మెట్ పై ఉన్న ఫ్యాన్లను వేగంగా తిప్పుతుంది. తద్వారా దుమ్ము దూరంగా వెళ్లిపోతుంది. రైతులు, వెల్డర్లు, కార్పెంటర్లు, ట్రాఫిక్ పోలీసులకు ఉపయోగకరంగా ఉంటుంది.
‘జీవాల రక్షణకు ఆగ్జిల్ కెమరా ’
కొలనూర్కు చెందిన ముస్త్యాల శ్రీనివాస్-అనిత మూడో సంతానం పూజశ్రీ. సుల్తానాబాద్లోని అల్ఫోర్స్స్కూల్లో 9వ తరగతి చదువుతున్నది. ఒక రోజు తాను స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా, బస్సు ముందుకు కదిలింది. ఈ క్రమంలో ఓ కుక్క పిల్ల అదే బస్సు టైరు కిందపడి చనిపోవడం చూసిన పూజశ్రీ చలించిపోయింది. ఇలా కుక్క పిల్లలే కాదు, చిన్నారులు కూడా చనిపోయే ప్రమాదం ఉందని గుర్తించింది. టైర్ల కింద పడి ఏ జీవి మృతి చెందకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని తన స్కూల్లో ప్రిన్సిపాల్, గైడ్ టీచర్ కే శ్యాంసుందర్రెడ్డిని అడిగింది. ఆయన సలహాలు సూచనలతో ‘ఆగ్జిల్ కెమెరాఫర్ స్కూల్ బస్సెస్’ను తయారు చేసింది. ఇది స్కూల్ బస్లే కాదు ఏ పెద్ద వాహనాలకైనా బిగించుకోవచ్చు. బస్సు మూవ్ చేసే సమయంలో బస్సు కింద ఏర్పాటు చేసిన కెమెరా ఆన్ అయి డ్రైవర్ ముందు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఈ మిషన్ ద్వారా ఏ జీవి ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు.