విద్యానగర్, డిసెంబర్ 18: స్మార్ట్ కరీంనగర్ను వైద్యానికి కేంద్ర బిందువుగా, ఓ మోడల్గా మార్చేందుకు డాక్టర్లు నిర్విరామంగా కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఆదివారం నెహ్రూచౌరస్తా సమీపంలో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ మౌనికారెడ్డి, రేడియాలజిస్టు డాక్టర్ నరేందర్రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎన్ఆర్ హాస్పిటల్ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఇప్పటికే కరీంనగర్ వైద్య రంగంలో ఎంతో ముందుకు వెళ్లిందన్నారు. గతంలో గుండె, కిడ్నీ, ఇతరత్రా జబ్బులు వస్తే హైదరాబాద్కు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం కరీంనగర్లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో ఉందన్నారు. కరీంనగర్తో పాటు చుట్టూ ఉన్న నాలుగు జిల్లాల ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లు అభినందనీయులన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల సైతం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తుందని, ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల వైద్యులు పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రోగులు దేవుళ్లుగా కొలుస్తున్న వైద్యులు సేవాభావంతో పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, రాబోయే రోజుల్లో వైద్యం అంటే కరీంనగర్ గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్లు సరిళ్ల ప్రసాద్, మేచినేని వనజ-అశోక్ రావు, మెండి శ్రీలత-చంద్రశేఖర్, దవాఖాన నిర్వాహకులు అభిలాష్ రెడ్డి, హరికృష్ణ ఉన్నారు.