మల్యాల, ఏప్రిల్ 11 : ఎన్నికల సమయంలో ధాన్యం క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుందనే కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి వల్లే రైతులు ప్రైవేట్ డీలర్లకు, నేరుగా రైస్మిలర్లకు అమ్ముకుని నష్టపోతున్నారని ఆవేదన చెందారు. బోనస్ మాట దేవుడెరుగు.. కనీసం మద్దతు ధరనైనా రైతులకు దక్కేలా కొనుగోలు కేంద్రాల్లో త్వరితగతిన ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేశారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, స్థానిక నాయకులతో కలిసి మల్యాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరి కోతలు ప్రారంభమై కొనుగోలు కేంద్రాల్లోకి ధాన్యం వస్తున్నదని, అయినా కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. గ్రామాల్లో ధాన్యం కుప్పలు పోసి ఎప్పుడు కొంటారో తెలియక దళారులను ఆశ్రయిస్తున్నారని, క్వింటాల్ రూ. 1800కే అమ్ముకొని నష్టపోతున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. రైతులపై ప్రేమ ఉన్నా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని, ధాన్యానికి తక్షణమే క్వింటాల్కు 500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
అనంతరం మల్యాలలో కొత్తగా నిర్మించిన ముత్యాల పోచమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మానాల, మ్యాడంపల్లి , తక్కల్లపల్లి, లంబాడిపల్లి గ్రామాల్లో కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొండపలుకుల రాంమోహన్రావు, వీర్ల వెంకటేశ్వర్రావు, మిట్టపల్లి సుదర్శన్, జన గం శ్రీనివాస్, బోయినపల్లి మధుసూదన్రావు, అయిల్నేని సాగర్రావు, కొరండ్ల నరేందర్రెడ్డి, సుభాన్, నేళ్ల రాజేశ్వర్రెడ్డి, తైదల శ్రీలత, ఎడిపల్లి అశోక్, బుచ్చయ్య, శివకుమార్, రియాజ్, బీరయ్య, వేణురావు, విష్ణు, రవివర్మ, శ్రీనివాస్, నలువాల సంజీవ్, చీకట్ల అశోక్, కుమారస్వామి, శంకర్, లక్ష్మణ్, మహేశ్ పాల్గొన్నారు.