బోయినపల్లి, ఏప్రిల్ 1 : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేయాలని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం బోయినపల్లిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ సర్కారు మూడు నెలల్లోనే ప్రజలకు దూరమైందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. యాసంగి పంటకు క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు, నాయకులందరూ ఐక్యతతో కృషి చేసి కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రాజెక్టులతో జరిగిన మేలు గురించి గడపగడపకూ వెళ్లి వివరించాలని సూచించారు.
అనంతరం బోయినపల్లిలో పెద్దమ్మ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని, మత్య్స కార్మికులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అన్ని వర్గాలకు బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు చెన్నాడి అమిత్కుమార్, మండలాధ్యక్షుడు కొండయ్య, వైస్ ఎంపీపీ నాగయ్య, మాజీ ఎంపీపీలు సత్తినేని భాగ్యలత, మాధవ్ దంపతులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
బోయినపల్లి మండలం శాభాష్పల్లె వద్ద శ్రీరాజరాజేశ్వర జలాశయంలో నీళ్లు లేక తేలిన రోడ్డు, ఏర్పడ్డ పగుళ్లను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి వినోద్కుమార్ పరిశీలించారు. నడుచుకుంటూ తిరుగుతూ పరిస్థితిని గమనించా రు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద చర్య లు తీసుకుంటే ఇంత దారుణ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మూడు పిల్లర్లు కుంగాయన్న సాకుతో ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం వల్లే పదేళ్లలో చూడ ని కరువు కాటకాలు ఈ ప్రభుత్వంలో చూస్తున్నామని చెప్పారు. మధ్యమానేరు నీళ్లులేక అడుగంటి పోయేది కాదని, వేసిన యాసంగి పంటలు ఎండిపోయే పరిస్థితే ఉండేది కాదన్నా రు. ఇది కాలం తెచ్చిన కరవు కాదని, ముమ్మాటికి కాంగ్రెస్ సృష్టించిన కరువని ధ్వజమెత్తారు.