చిగురుమామిడి, ఏప్రిల్ 13: ‘కాంగ్రెస్వన్నీ ఉద్దెర మాటలు. మోసపూరిత హామీలు. ఆ పార్టీతో అయ్యేది లేదు. పోయేది లేదు. ప్రజలను మభ్యపెట్టి అబద్ధాల పునాదులపై గద్దెనెక్కింది. హామీలు అమలు చేయకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతరు’ అని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ హెచ్చరించారు. హుస్నాబాద్లో శనివారం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ విద్యార్థి యువజన చైతన్య సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు.
పద్నాలుగేండ్లు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాలకు సాగు నీరందించామని చెప్పారు. పదేండ్లలో 1.61లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగాలకు గత ప్రభుత్వం పరీక్షలు కూడా నిర్వహించిందని పేరొన్నారు. 2014లో తాను ఎంపీగా గెలిచిన తర్వాత కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ మంజూరు చేయించి, 50 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయిస్తే ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ పట్టించుకోకపోవడంతో కేంద్రం ఇతర రాష్ట్రాలకు తరలించిందని మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ ఐదేండ్లలో బండి పైసా పనిచేయలేదని, ఒక గుడి, ఒక నవోదయ పాఠశాల తేలేదని దుయ్యబట్టారు. ఆయన ఏ అర్హతతో ప్రజలను ఓట్లు అడుగుతున్నారో చెప్పాలన్నారు.
సంజయ్కి యువకులు, విద్యార్థులపై చిత్తశుద్ధి లేదని, అందుకే కేంద్రం నుంచి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు తేలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలున్నా ఇంకా నవోదయ విద్యాలయాలు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. కేంద్రంలో 400 సీట్లు వస్తున్నాయని ప్రధాని మోడీ అంటున్నారని, అందులో బండి సంజయ్ లేకున్నా జరిగే నష్టమేమీ లేదన్నారు.
పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు వినిపించాలంటే ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుడు బీ ప్రకాశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలు దక్కాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా రాబోయే ఎన్నికల్లో వినోద్ను గెలిపించుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ మాట్లాడుతూ, బండి సంజయ్ ఐదేళ్లు ఎంపీగా ఉన్నా.. ఐదు రూపాయలు తేలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వినోద్కుమార్ ఎంపీగా గెలిపించాలని కోరారు.