కరీంనగర్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నదుల అనుసంధానం పేరిట తెలంగాణకు జీవధార అయిన గోదావరి జలాలను కొల్లగొట్టే కుట్ర చేస్తున్నదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. తమిళనాడులో రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఇదంతా చేస్తున్నదని మండిపడ్డారు. నిత్యం ధర్మం గురించి మాట్లాడే బండి సంజయ్ జలదోపిడీ గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతనే ఈ ప్రక్రియ చేపట్టాలని, అలా తేల్చకుండా నదుల అనుసంధానం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తర భారతదేశంలోని బ్రహ్మపుత్ర, గంగా నదులు ఏడాదిలో 365 రోజులు ప్రవహిస్తాయని, గోదావరి, కృష్ణా నదులు వాటి మాదిరి కాకున్నా దేశంలోని అతి పెద్ద నదుల్లో ఇవీ ఉంటాయని తెలిపారు. తెలంగాణ వాటా తేల్చకుండా నదుల అనుసంధానం చేయవద్దని గతంలో కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కుట్రలో భాగంగానే ఇచ్చంపల్లి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని, ఈ నెల 15న కేంద్ర జలవనరుల శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసిందని చెప్పారు.
ఈ ప్రాజెక్టుకు వంద మీటర్ల ఎత్తు పెంచి కడితే వేలాది ఎకరాల అటవీ భూములు నీట మునుగుతాయని, ఈ విషయంలో కేంద్రం ఏం చెబుతున్నదో, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొన్నదన్నారు. 1985లో ఇచ్చంపల్లి నిర్మించాలనుకున్నప్పుడు మహారాష్ట్రతోపాటు అప్పటి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉత్తరాదిన ప్రవహించే గంగా, మహానది, బ్రహ్మపుత్ర నదులను అనుసంధానం చేయకుండా దక్షణాదిలోని కృష్ణా, గోదావరి, కావేరి నదులను అనుసంధానం చేయడంలో కుట్రకోణం ఉన్నదన్నారు. తెలంగాణ జలాలను కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నా బండి సంజయ్ మా ట్లాడక పోవడం శోచనీయమని విమర్శించారు. నోరుతెరిస్తే ధర్మాన్ని గుర్తు చేసే ఆయనకు ఇది అధర్మమని తెలియడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని తాను అనేక సార్లు పార్లమెంట్లో ప్రస్తావించానని, ఇప్ప టి నీటి పారుదల శాఖ మంత్రి ఉతమ్ కుమార్రెడ్డి కూడా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. భద్ర, బుందేల్ఖండ్ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించిన కేంద్రం తెలంగాణ ప్రాజెక్టులను విస్మరించిందని మండిపడ్డారు.
దీనిపై తెలంగాణ బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాష్ట్రంలోని నలుగురు ఎంపీలు ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని, కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నదుల అనుసంధానాన్ని రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే వివిధ మంత్రిత్వ శాఖల వద్దకు వెళ్లి నిధులు రాబట్టాలని హితవుపలికారు. తెలంగాణలోని సమ్మక్క బరాజ్, సీతమ్మ సాగర్ తదితర ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కానీ, ఇప్పటి వరకు అలా చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులన్నింటికీ దేవుళ్ల పేర్లు పెట్టామని, మేడిగడ్డకు లక్ష్మీ బరాజ్, అన్నారానికి సరస్వతీ, సుందిళ్లకు పార్వతీ, లక్ష్మీపూర్కు గాయత్రీ, మిడ్మానేరుకు రాజరాజేశ్వర ఇలా అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ అని పేర్లు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
మేడిగడ్డ కుంగింది వాస్తవమని, దీనిపై కేంద్రం విచారణ జరిపితే నిజానిజాలు వెలుగులోకి వచ్చేవన్నారు. మేడిగడ్డ వద్ద ప్రత్యామ్నాయంగా కాఫర్ డ్యాం నిర్మించాలని మొదటి నుంచి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం వినలేదన్నారు. సకాలంలో కాఫర్ డ్యాం నిర్మించి ఉంటే 50 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకునేదన్నారు. ఈ పని చేయకపోవడంతో మధ్య, దిగువ మానేరు జలాశయాలు ఎండిపోయాయని, మత్స్యకారులు కూడా నష్టపోవాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఈ సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ వై సునీల్రావు, మాజీ ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు గడ్డం నాగరాజు, కర్ర రాజశేఖర్, పొన్నం అనిల్ కుమార్గౌడ్ పాల్గొన్నారు.
గోదావరిలో ఇప్పటికీ 1200 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. తెలంగాణ నీళ్లను తమిళనాడుకు తరలించే ప్రయత్నంలో ఉన్నది. అక్కడి రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఇదంతా చేస్తున్నది. కరీంనగర్, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాలు గోదావరిని నమ్ముకుని బతుకుతున్నయి. ఇప్పుడు గోదావరిని కావేరితో అనుసంధానం చేస్తే ఈ జిల్లాలు ఎడారిలా మారిపోతయి.
– బోయినపల్లి వినోద్ కుమార్