కార్పొరేషన్, నవంబర్ 23: కరీంనగర్ నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచుకునే దిశగా చర్యలు ప్రారంభించింది. ఈ విషయంలో గతంలోనే పాలకవర్గ సర్వసభ్య సమావేశంలోనూ సభ్యులంతా కూడా బల్దియా ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న నగర మేయర్, అధికారులు ఆదాయం పెంపునకు ఉన్న మార్గాలను పరిశీలించారు. ఈ మేరకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్ను, నల్లా పన్నుతో పాటు ట్రేడ్ లైసెన్సులు, ప్రకటనల బోర్డుల ద్వారా వచ్చే ఆదాయాలపై దృష్టిసారించారు. వీటితో పారిశుధ్య నిర్వహణలో వచ్చే ఆదాయం కూడా సక్రమంగా వసూలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సమాలోచనలు చేశారు. దీనికి అనుగుణంగా నగరపాలక సంస్థ పరిధిలో ట్రేడ్ లైసెన్సులను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
నగరంలోని ప్రతి వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్సు అందించే విధంగా చర్యలు చేపడుతున్నారు. వీటితో పాటు కమర్షియల్ ప్రాంతాల్లో, వ్యాపార సంస్థల నుంచి సేకరించే చెత్తను విక్రయించి ఆదాయం పెంపునకు కృషి చేస్తున్నారు. వీటితో పాటు ప్రకటనల బోర్డుల ద్వారా వచ్చే ఆదాయంపై చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా నగరంలోని ప్రధాన రహదారుల్లో డివైడర్ల మధ్యలో పెద్ద సంఖ్యలో ప్రకటనల బోర్డుల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశారు.
ఖర్చులకు అనుగుణంగా ఆదాయం పెంపు
నగరం రోజు రోజుకూ విస్తరిస్తున్నందున బల్దియా పరిధిలో రోజు వారి నిర్వహణ వ్యయాలతో పాటు అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు సవాల్గా మారుతున్నది. ప్రస్తుతం అత్యధికంగా ఇంటి పన్ను ద్వారానే ఆదాయం వస్తుండగా, అభివృద్ధి పనులకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులపైనే ఆధారపడాల్సి వస్తున్నది. దీనికి తోడు విస్తరిస్తున్న నగరంలో పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, మౌళిక సదుపాయాలు, ఇతర పనుల కోసం భారీగా ఖర్చులు అవుతున్నాయి. వీటికి అనుగుణంగా నగరపాలక సంస్థ ఆదాయాన్ని కూడా పెంచుకోవాల్సి వస్తున్నది. దీనిని దృష్టిలో పెట్టుకున్న బల్దియా పాలకవర్గం ఆదాయ మార్గాలపై సమాలోచనలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకొని ఆదాయాన్ని పెంచుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.
డివైడర్ల మధ్యలో బోర్డుల ఏర్పాటు
నగరంలోని 14 కిలోమీటర్ల మేరకు ఉన్న ప్రధాన రహదారుల్లో ప్రకటనల బోర్డుల ఏర్పాటుకు భారీగా డిమాండ్ ఉంది. ఈ మేరకు డివైడర్ల మధ్యలో బోర్డులను ఏర్పాటు చేసుకునేందుకు అనేక సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. వీటిపై ఇన్నాళ్లు పెండింగ్ పెడుతూ వచ్చిన పాలకవర్గం ఇటీవల వీటి ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో నగరంలో సుమారు 40 మేరకు బోర్డులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పలు సంస్థలకు ఈ బోర్డుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో ప్రధాన చౌరస్తాల్లో పనులు సాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ బోర్డులను ఏర్పాటు చేయగా, మిగితా ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు పనులు సాగుతున్నాయి. వీటి ద్వారా డిపాజిట్ కింద నగదుతో పాటు సంవత్సర ఆదాయం వస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇతర ఆదాయ మార్గాల పెంపుపై కూడా అధికారులు దృష్టిసారిస్తున్నారు.