కార్పొరేషన్, ఫిబ్రవరి 20 : అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కూలీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులంతా మేడారంలోని సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. 20 నుంచి 25 ఏండ్లుగా ఈ వలస కూలీలు ఇక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారన్నారు.
ప్రమాదంలో గుడిసెలు కోల్పోయిన వారికి తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి రూ.లక్ష అందించాలని, పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్ని ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులంతా సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. సకాలంలో మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బందిని ఆయన అభినందించారు. మంటలు ఆర్పేందుకు స్థానిక మేయర్ సునీల్రావు, కార్పొరేటర్ మేచినేని వనజా అశోక్రావు ఇద్దరు చేసిన సహాయాన్ని మెచ్చుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని కూడా అభినందించారు.