‘రానున్న ఎన్నికల గురించి మేం ఆలోచించడం లేదు.. భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నాం. ఆ దిశగానే మేం పని చేస్తాం’ అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ నియోజకవర్గంలో వివిధ సమావేశాలు, కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మధ్యాహ్నం పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించిన మహిళల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాఫూలే మైదానంలో జరిగిన యువగర్జన సభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సభకు వేలాది మంది యువకులు తరలివచ్చి మంత్రి గంగులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన ప్రసంగించారు.
– కార్పొరేషన్, నవంబర్ 6
కార్పొరేషన్, నవంబర్ 6 : తాము వచ్చే ఎన్నికల కోసం ఆలోచన చేయడం లేదని, వచ్చే భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నామని, దాని కోసమే పని చేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక మహాత్మా జ్యోతిబా ఫూలే మైదానంలో నిర్వహించిన యువగర్జన సభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువత మంత్రికి ఘనస్వాగతం పలుకగా, వారినుద్దేశించి ఆయన మాట్లాడారు. భవిష్యత్ తరాలు బాగుండాలన్న ఆలోచనతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. తాను ఒక భయం, ఆవేదనతో మాట్లాడుతున్నానని, ఇప్పుడు తెలంగాణను ఢిల్లీ చేతుల్లో పెడితే భవిష్యత్ అంధకారంగా మారుతుందన్నారు.
యువత తన కోసం ఈ ఎన్నికల్లో పని చేస్తే తన రక్తాన్ని యువత కోసం ధారపోస్తానని తెలిపారు. కరీంనగర్ ఇప్పుడు షైనింగ్ సిటీగా మారిందని, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా మానేరు రివర్ ఫ్రంట్ను తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఈర్ష్యతోటి ఆంధ్రా నాయకులు విషం చిమ్ముతున్నారని, కేసీఆర్ను ఓడించి ఇక్కడి సంపదను దోచుకునేందుకు ఆంధ్ర నాయకులంతా బీజేపీ, కాంగ్రెస్ ముసుగుల్లో హైదరాబాద్లో అడ్డా వేశారని ఆరోపించారు. వారి మాటలు నమ్మి ఓట్లు వేస్తే యువతకు అరిగోస తప్పదన్నారు. తనను మరోసారి గెలిపిస్తే కరీంనగర్కు అమెరికా నుంచి కంపెనీని తీసుకువస్తానని, దీని వల్ల 5 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. అలాగే మానేరు రివర్ ఫ్రంట్ ద్వారా 3 వేల ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఇవన్నీ యువత కోసమే తాము చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఇక్కడ తన కన్నా పెద్ద హిందువు ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. ప్రతి ఏటా ఎంతో బ్రహ్మాండంగా వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. తాము దేవున్ని గుండెల్లో పెట్టుకుంటే, వాళ్లు దేవున్ని మతం, తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టి ఎంపీగా గెలిచిన ఆయన కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉన్న ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కోసం ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలకు పడిపోతే భవిష్యత్ ఉండదని సూచించారు. భవిష్యత్ తరాలు బాగుండాలన్న లక్ష్యంతో పని చేస్తే బీఆర్ఎస్ను గెలిపించుకుంటారో రెచ్చగొట్టే పార్టీలను గెలిపిస్తారో యువత నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కేసీఆర్ను ఈ ఎన్నికల్లో కాపాడుకుంటే యువతను తాము కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.
ఉద్యమించి సాధించుకున్న తెలంగాణను కాపాడుకునే బాధ్యత యువతపైనే ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. ఆంధ్రా నాయకులు మళ్లీ తెలంగాణపై కన్ను వేసి ఇక్కడి సంపదను దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. అనునిత్యం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరాటపడుతున్న బీఆర్ఎస్ నాయకులపై ఢిల్లీ పార్టీలకు, ఇతరులకు అక్కసుగా ఉంటుందన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కడితే బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఐదు ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కళాశాల కూడా లేదని, కానీ తాము ఇప్పుడు నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 35 ప్రభుత్వ మెడికల్ కళాశాలు ఉన్నాయని గుర్తు చేశారు.
ఇలాంటి సమయంలో రాష్ర్టాన్ని కాంగ్రెస్కు అప్పగిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందని హెచ్చరించారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని, కానీ తాము ప్రతిపక్షంలో ఉన్న తాను ఎంపీగా ఉన్న సమయంలో కేంద్రం నుంచి రూ.1000 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. బీజేపీ పాలన ఉన్న రాష్ర్టాలకు రూ.వేల కోట్ల నిధులు మంజూరు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలు ఉన్నా ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోతున్నారని విమర్శించారు.
ఇలాంటి పార్టీలను నమ్మకుండా అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, నగర మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, నాయకులు గంగుల ప్రదీప్, నందెల్లి మహిపాల్, వెంకట్, హరీశ్, తిరుపతినాయక్ పాల్గొన్నారు.