కరీంనగర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : న్యాయ నిర్ణేతలైన ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఉత్కంఠ రేపిన కరీంనగర్ ఫలితాల అనంతరం ఆదివారం రాత్రి స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా తనను నాలుగోసారి గెలిపించిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. తాను చేసిన అభివృద్ధిని చెప్పి ఓట్లు అడిగానని, ఆ అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని కొనసాగించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తన విజయం కోసం నియోజకవర్గంలోని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, దళితులు, బలహీన, తదితర అన్ని వర్గాల ప్రజలు కృషి చేశారని, నియోజకవర్గాన్ని తాను అభివృద్ధి చేశానని విశ్వసించి తనకు ఓట్లు వేశారని తెలిపారు.
కరీంనగర్ను రాష్ట్రంలో రెండో నగరంగా అభివృద్ధి చేయాలనే తన లక్ష్యాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఇన్నాళ్లూ అధికార పార్టీలో మంత్రిగా పనిచేసిన తాను ఇప్పుడు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని అన్నారు. అభివృద్ధిని కొనసాగించేందుకు ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వాలని కోరాతామని, ఒక వేళ నిధులు ఇవ్వకుంటే ప్రశ్నిస్తామని, లేదంటే ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. తమ నాయకుడు కేసీఆర్ తమకు తరుచూ చెబుతారని, ఓట్లు వేసిన ప్రజలను ఎప్పటికీ విస్మరించకూడదని, వారి రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలని అంటారని, అదే స్ఫూర్తితో ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందిస్తానని అన్నారు. తమ పార్టీ ఓడిపోయినా రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రశాంతంగా ఉండేలా చూస్తానని అన్నారు. ఈరోజు వరకు ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, రేపటి నుంచి అభివృద్ధి ఒక్కటే తనకు కనిపిస్తుందని, రాజకీయాలు మాట్లాడబోనని అన్నారు.
తనను రాజకీయాలు మాట్లాడేలా చూడవద్దని ఇతర పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి నాలుగుసార్లు ప్రాతినిథ్యం వహించే అదృష్టాన్ని కలిగించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తన గెలుపు కోసం కసిగా పనిచేశారని, ప్రతి పార్టీ కార్యకర్తకు, నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంఐఎం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా తన గెలుపునకు సంపూర్ణంగా సహకరించారని వారికి ధన్యవాలు చెప్పారు. రేపటి నుంచి అధికారంలోకి వచ్చే పార్టీ ఈ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తానని అన్నారు. అభివృద్ధికి సహకరిస్తామని, ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట నగర మేయర్ వై సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్తోపాటు ఎంఐఎం పార్టీ నాయకులు ఉన్నారు.