వాన వరదై పోటెత్తుతున్నది. ఒకటికాదు రెండు కాదు వారం రోజులుగా తెరిపిలేకుండా ప్రతాపం చూపుతుండడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అతలాకుతలమైతున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతుండగా, పలు కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాజ్వేలు ఓవర్ ఫ్లో అయిపోవడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలు అటుగా వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.
కరీంనగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జలదిగ్భందంలో చిక్కుకుంది. ఆకాశానికి చిల్లుపడ్డదా అన్నట్లు వర్షం కురవడంతో ఎటు చూసినా జలమే కనిపించింది. కరీంనగర్, జగిత్యాల రహదారిలో ఆర్టీసీ వర్క్షాపు సూర్యనగర్ వద్ద రోడ్డుపై వరద ప్రవాహం విపరీతంగా ఉండడంతో పోలీసులు వాహనాలను రేకుర్తి, శాతవాహన యూనివర్సిటీ మీదుగా మళ్లించారు. కరీంనగర్లోని లోతట్టు ప్రాంతాలైన ఆటోనగర్లో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్ వద్ద కరీంనగర్- సిరిసిల్ల రోడ్డుపై భారీగా వరద ప్రవహిస్తున్నది. కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్షేడు, చేగుర్తి తదితర గ్రామాల్లో వరద నీరు ఇండ్లలోకి వచ్చింది. చెర్లభూత్కూర్, కొండాపూర్ మధ్య వరద ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచి పోయాయి. శంకరపట్నం మండలం అర్కండ్ల వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంలో కన్నాపూర్, అర్కండ్ల గ్రామాల వైపు ముళ్ల కంచె అడ్డంగా పెట్టి రాకపోకలను నిలిపివేశారు. ఇప్పలపల్లి గ్రామ పంచాయతీ వరద నీటిలో మునిగింది.
గన్నేరువరం మండలం మైలారం నుంచి హన్మాజీపేట వెళ్లే దారిలో వరద ఉధృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. చిగురుమామిడి మండలం ఇందుర్తి నుంచి సిద్దిపేట జిల్లా కోహెడ మధ్య ఎల్లమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పోలీసులు రెండు వైపులా కంప వేసి రాకపోకలు నిలిపివేశారు. హుజూరాబాద్ మండలం జూపాక, బొంతలపల్లి గ్రామాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. జూపాక హుజూరాబాద్ ప్రధాన దారి పూర్తిగా జలమయమైంది. హుజూరాబాద్ పట్టణంలోని చిలుక వాగు ఉధృతికి శ్మశాన వాటిక, గెస్ట్ హౌస్లు నీట మునిగాయి. వీణవంక మండలం బేతిగల్, వీణవంక గ్రామాల మధ్య, సైదాపూర్ నుంచి హుజూరాబాద్కు, అక్కడి నుంచి మొలంగూర్కు రాకపోకలు నిలిచిపోయాయి. హుజూరాబాద్ పట్టణ పరిధిలోని కరీంనగర్రోడ్డు పెట్రోల్ పంప్ ఎదురుగా కొత్తపల్లికి వెళ్లే దారిలో నెయ్యి తయారీ కేంద్రం నీట మునిగింది. దీంతో సుమారు లక్షన్నర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు బాధితుడు నాగేశ్వర్రావు తెలిపారు. సంఘటన స్థలాన్ని రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు సందర్శించి, ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఒక్క రోజులో ఇంత పెద్ద వర్ష పాతం నమోదవడం ఇదే మొదటి సారి అని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సగటు వర్షపాతం 208.6 మిల్లీమీటర్లు ఒకే సారి నమోదు కావడం ఇప్పటి వరకు జరగ లేదు. హుజూరాబాద్ డివిజన్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. అత్యధికంగా ఈ డివిజన్లోని ఇల్లందకుంటలో 382.4 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. జమ్మికుంటలో 293.6, హుజూరాబాద్లో 278.8, వీణవంకలో 276.8, సైదాపూర్లో 201.8, శంకరపట్నంలో 167.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అలాగే కరీంనగర్ డివిజన్లో చూస్తే గన్నేరువరంలో 260.6 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా జిల్లాలోని అన్ని మండలాల్లో ఎక్సెస్ వర్షపాతం నమోదైంది.