విద్యానగర్, మార్చి 1: కరీంనగర్ జనరల్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. పైసా ఖర్చు లేకుండా రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల విలువైన ఆపరేషన్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన బరిబద్దుల మల్లమ్మ (65) కొద్దిరోజుల క్రితం కడుపునొప్పితో బాధపడుతూ జనరల్ హాస్పిటల్లో చేరింది. ప్రొఫెసర్, హెచ్ఓడీ డాక్టర్ శాలిని ఆధ్వర్యంలో మల్లమ్మను పరీక్షించారు. బల్లె (స్లీన్) పగిలిపోయి బ్లీడింగ్ అవుతున్నట్లు గుర్తించారు.
వెంటనే శస్త్ర చికిత్స చేయకపోతే ప్రాణాపాయం ఉంటుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. క్లిష్టమైన శస్త్ర చికిత్సను సర్జికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహేందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రణయ్, అనస్తషీయా డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శంతన్ ఆధ్వర్యంలో ఓపెన్ సర్జరీ చేశారు. శుక్రవారం పూర్తిగా కోలుకున్న మల్లమ్మను డిశ్చార్జి చేశారు. రూపాయి ఖర్చు లేకుండా లక్షల విలువ చేసే ఆపరేషన్ను చేయడంతో మల్లమ్మ కొడుకు రాజేశ్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
కరీంనగర్ జనరల్ దవాఖానలో కార్పొరేట్కు దీటుగా మెరుగైన సేవలందిస్తున్నాం. ల్యాప్రోస్కోపిక్, కీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నాం. దవాఖానలో వైద్య బృందం సొంత పరికరాలతో సర్జరీలు చేయడం అభినందనీయం. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తెస్తాం.
– డాక్టర్ వీరారెడ్డి, దవాఖానా సూపరింటెండెంట్